నాగర్కర్నూల్/వనపర్తి (నమస్తే తెలంగాణ)/కొల్లాపూర్, జనవరి 25 : ‘పేద విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం మీకు ఇష్టంలేదా?, మరెందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు?, అభివృద్ధిని అడ్డుకోవడమే మీ ఎజెండానా..?’ అని బీజేపీపై వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా 153 వైద్య కళాశాలను మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు ఒక్క కళాశాల మంజూరు చేయలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఒకేసారి 8 వైద్య కళాశాలలు మంజూరు చేశారని స్పష్టంచేశారు. మంగళవారం వనపర్తి జిల్లాలో రూ.17 కోట్లతో నిర్మించిన 180 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రంతోపాటు 20 పడకల నవజాత శిశు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలిసి హరీశ్రావు ప్రారంభించారు. అప్రోచ్రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి వనపర్తి దవాఖానను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న మెడికల్, నర్సింగ్ కళాశాలలు, కలెక్టరేట్ భవన సముదాయాలను పరిశీలించారు. నాగర్కర్నూల్లోని పాలియేటివ్ కేంద్రం, కొల్లాపూర్ సమీపంలో రామాపురం శివారులో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. రూ.7,280 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ విద్యావ్యవస్థ దేశంలో ఆదర్శంగా నిలవబోతున్నదని చెప్పారు.
మన ఊరు-మన బడితో మారనున్న దశ
తెలంగాణకు రావాల్సిన గిరిజన వర్సిటీ, ఐఐఎం, మెడికల్ కశాళాలలు ఇవ్వకపోగా, ఐటీఐఆర్ను రద్దు చేసిన బీజేపీ నేతలపై మంత్రి ఫైర్ అయ్యారు. ‘మన ఊరు-మన బడి’ పాఠశాలల దశ దిశ మార్చుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్టు చెప్పారు. దేనికి విమర్శించాలో, దేనికి ఎలా స్పందించాలో కూడా తెలియని గుడ్డి వ్యతిరేకత బీజేపీ నేతల్లో ఉన్నదని ఎద్దేవాచేశారు. ఇంగితం లేకుండా అభివృద్ధిని అడ్డుకోవడమే కమలం పార్టీ ఎజెండానా? అని నిలదీశారు. వైద్యసేవల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమంగా నిలిచిందని, ఈ విషయాన్ని నీతిఆయోగ్ స్పష్టం చేసిందని మంత్రి పేర్కొన్నారు. కేరళ మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానంలో, మన రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నదన్నారు. భవిష్యత్తులో దేశంలోనే నంబర్వన్గా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో కృషి చేస్తున్నట్టు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు ఈ విషయంలో అట్టడుగు స్థానంలో ఉన్నాయన్నారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు.
అందుబాటులో 330 పడకలు : మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి జిల్లా ప్రజలకు 330 పడకలతో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వందేళ్లయినా సాగునీటికి ఢోకాలేకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. జల, ధాన్యరాశులతో జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయల కల్పనా సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల వరకు సేవలు
ఆరోగ్యశ్రీ కింద పేదలు ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలు అందుకునేలా సీఎం కేసీఆర్ ఆదేశించారని, గతంలో ఇది రెండు లక్షల పరిమితితో ఉండేదని మంత్రి హరీశ్రావు తెలిపారు. 15-17 ఏండ్ల పిల్లలకు సంబంధించి వ్యాక్సినేషన్లో వనపర్తి జిల్లా 90 శాతంతో రాష్ట్రంలో అగ్రభాగాన నిలిచిందని, ఇందుకు కృషిచేసిన కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాను అభినందించారు. కరోనాను కట్టడి చేయాలన్న సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే జ్వర సర్వే నిర్వహిస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు కోరితే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేస్తామన్నారు.