వరంగల్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఖిలా వరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ నోముల షణ్ముఖ రెడ్డితో పాటు సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో కొత్త పాత అనే తేడా లేకుండా అందరిని కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు.