హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్ఫూర్తిమంతమైన, మానవీయ విలువలున్న నాయకుడు అని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, చామకూర మల్లారెడ్డి ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన ప్రజల కష్టాలు తెలుసుకొని నాయకుడిగా ఎదిగారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో రాటుదేలిన కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడనే మంచి పేరు తెచ్చుకొన్నారని కొనియాడారు. తెలంగాణభవన్లో సికింద్రాబాద్ టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్జి తలసాని సాయికిరణ్యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
మంత్రులు భారీ కేక్ను కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. తెలంగాణభవన్ ఆవరణలో కేటీఆర్ సైకత చిత్రం, హాల్లోని భారీ స్క్రీన్పై కాళేశ్వరం ప్రాజెక్టు, దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన నమూనాను ప్రదర్శించారు. అనంతరం లోకల్ టు గ్లోబల్ పేరుతో కేటీఆర్ జీవిత విశేషాలపై రూపొందించిన డాక్యుమెంటరీని మంత్రులు విడుదల చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయం నుంచి ఎనిమిదేండ్ల రాష్ట్ర ప్రగతిలో కేటీఆర్ చూపిన చొరవ, ప్రదర్శిస్తున్న దార్శనికతను ఈ డాక్యుమెంటరీలో వివరించారు. తెలంగాణభవన్ పరిసరాల్లో ఏర్పాటుచేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో పండుగ వాతావరణం నెలకొన్నది. కొమ్ము శిరస్సులు, కోయడోలు దెబ్బలతో తెలంగాణభవన్ మార్మోగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పార్టీ నాయకులు గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్వీ రక్తదానం
కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని తెలంగాణభవన్లో టీఆర్ఎస్ నేత, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్తో పాటు పలువురు విద్యార్థి నాయకులు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్ ప్రారంభించారు.