Make in India | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మేకిన్ ఇండియా అంటూనే వైద్య రంగానికి అవసరమైన ఎన్నో పరికరాలు, ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుండటంపై లైఫ్సైన్సెస్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన పరికరాల విషయంలో చైనా లాంటి దేశాలపై ఆధారపడటం అత్యంత ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు సానుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై దృష్టి సారించాలని, దీనికి మౌలిక వసతులతోపాటు ప్రత్యేకంగా పాలసీలను రూపొందించాలని సూచించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న బయోఏషియా-23 సదస్సులో శనివారం ‘గ్లోబల్ సప్లయ్ చెయిన్ ట్రాన్స్ఫార్మేషన్’ అంశంపై జరిగిన చర్చలో ఇండస్ట్రీ నిపుణులు పాల్గొన్నారు. ఈ చర్చలో కేంద్ర ఫార్మాస్యూటికల్ శాఖ కార్యదర్శి ఎస్ అపర్ణ, ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో మన్ని కంటిపూడి, భారత్ సీరమ్ అండ్ వ్యాక్సిన్ సంస్థ ఎండీ, సీఈవో సంజీవ్ నవాన్గుల్, ఓప్పీ ప్రెసిడెంట్ సురేశ్ పట్టాతిల్, వార్బర్గ్ పింక్స్ ఎండీ నరేంద్ర ఓస్వాల్ పాల్గొన్నారు. కరోనా అనంతరం ఫార్మారంగంలో సరఫరా వ్యవస్థకు ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పారు.
కరోనా కంటే ముందు కంపెనీలు.. ఉత్పత్తులు, నిల్వలు, ఎగుమతులపై అంతగా దృష్టి సారించలేదని అభిప్రాయపడ్డారు. కానీ గత మూడేండ్లలో ఈ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, దేశ అవసరాలకు అనుగుణంగా కేంద్రం కూడా తగు ప్రణాళికలను రూపొందిస్తున్నదని ఫార్మాస్యూటికల్ శాఖ కార్యదర్శి ఎస్ అపర్ణ చెప్పారు. అయితే ఉన్న లోపాలను సవరించుకునేలా కంపెనీలు, పాలసీ మేకర్లు కలిసి ఓ వేదికపైకి రావాలని చెప్పారు. బయోఏషియా తరహా వేదికలు క్లిష్టమైన సమస్యలను బహిర్గతం చేయడంలో ముఖ్య భూమికను పోషిస్తాయన్నారు. సుస్థిరమైన సప్లయ్ చెయిన్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. లేదంటే వైద్య, ఫార్మా రంగానికి అవసరమైన ముడి పదార్థాల కొనుగోలు సమస్యాత్మకంగా మారుతుందని తెలిపారు. కొవిడ్ తర్వాత ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది కానీ ఇప్పటికీ ముడి పదార్థాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత లాజిస్టిక్స్, సప్లయ్ చైన్పై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అలాంటి ఆకస్మిక విపత్తులతో సంబంధం లేకుండా మెరుగైన సరుకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. దానికి అనుగుణంగా దేశీయ కంపెనీలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తే ఎలాంటి క్లిష్టపరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనే అవకాశం వస్తుందని చెప్పారు.