భువనేశ్వర్ : చేతబడి నెపంతో ఓ వ్యక్తికి బలవంతంగా మూత్రం తాగించి, మలం తినిపించిన ఘటన ఒడిశాలోని బాలన్గిరి జిల్లాలో వెలుగు చూసింది. పరౌబాది గ్రామానికి చెందిన హదిబంధు బగర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే అనుకోకుండా గ్రామంలోని కొందరు అనారోగ్యానికి గురయ్యారు. హదిబంధు చేతబడి చేయడంతోనే గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని కొందరు ఆరోపించారు.
ఈ క్రమంలో జులై 3వ తేదీన కొంతమంది బగర్తి నివాసానికి వెళ్లి బయటకు లాక్కొచ్చారు. గ్రామ పెద్దలు అతన్ని పిలిపించి.. చేతబడి ఎందుకు చేస్తున్నావు? అని ప్రశ్నించారు. ఇందుకు శిక్షగా బలవంతంగా మూత్రం తాగించి, దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మలాన్ని తినిపించి.. క్రూరమృగాల్లా ప్రవర్తించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది.
మొత్తానికి పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని బగర్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతనిపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.