KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్ రంగానికి దిక్సూచిగా భావించే బయో ఏషియా-2023 సదస్సు ఈ నెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగనున్నది. 50 దేశాల నుంచి లబ్ధప్రతిష్ఠులైన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు, మేధావులు ఈ సదస్సులో పాల్గొని వైద్యం, లైఫ్సైన్సెస్ రంగాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు కొత్త పరిష్కారాలు కనుగొనటంపై విస్తృతంగా చర్చలు జరుపనున్నారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సు 20వది. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్.. షేపింగ్ ద నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్’ అనే సందేశంతో ఈసారి సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. సదస్సు నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మంగళవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
లైఫ్సైన్సెస్ రంగానికి ప్రపంచ హబ్గా హైదరాబాద్ నగరం అవతరించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, అందులో బయో ఏషియా సదస్సు కూడా ఒకటని పేర్కొన్నారు. బయో ఏషియా సదస్సు ఈ ఏడాది అరుదైన మైలురాయిని చేరుకొన్నదని.. ఈసారి 20వ సద స్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రతిష్ఠలున్న శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై రాబోయే తరానికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషిచేయాలని ఈ వేదిక ద్వారా పిలుపు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
లైఫ్ సైనెస్స్ రంగంలో అద్భుత సేవలు అందించిన వ్యక్తులకు ప్రదానం చేసే ‘జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు’ ఈ ఏడాది ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్కు అందజేయనున్నట్టు తెలిపారు. లాంగర్ అమెరికాలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎంఐటీ) ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రఖ్యాత బయోఫార్మా కంపెనీ మోడెర్నా సహ వ్యవస్థాపకుడు. ఇప్పటివరకు నిర్వహించిన 19 బయో ఏషియా సదస్సుల ద్వారా ప్రపంచంలోని 100 కుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, మేధావులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, లాస్కర్ అవార్డ్ గ్రహీతలు, నిపుణులను ఒకే వేదికపైకి తెచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ను, తెలంగాణ రాష్ర్టాన్ని, భారత దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసినట్టు చెప్పారు. ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకొని పెట్టుబడులు ఆకర్షించాలంటే ‘బయో ఏషియా’ను చూసి నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం తమ ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అనేక రాష్ర్టాలకు తెలంగాణను ఉదాహరణగా చూపిందని గుర్తుచేశారు.
గత ఏడాది సదస్సుకు 55 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారని, ఈసారి కూడా 50కిపైగా దేశాల నుంచి ప్రతినిధులు రానున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది నుంచి సదస్సులో దేశాలు భాగస్వాములు అవుతున్నాయని చెప్పారు. గత ఏడాది స్విట్జర్లాండ్ భాగస్వామిగా వ్యవహరించిందని గుర్తుచేశారు. ఈ ఏడాది భాగస్వామ్య దేశంగా బ్రిటన్, అంతర్జాతీయ స్థాయిలో ప్రాంతీయ భాగస్వామిగా బెల్జియంలోని ‘ఫ్లాండర్స్’ వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు. మొదటిసారిగా ఈ ఏడాది ఆపిల్ సంస్థ ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఈ సారి కూడా కాన్ఫరెన్స్లు, ఎగ్జిబిషన్లు, బిజినెస్ పార్ట్నర్ మీటింగ్స్, బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్, లంచ్ మీటింగ్స్, నెట్వర్కింగ్ రిసెప్షన్స్, బయోపార్క్ విజిట్, రౌండ్ టేబుల్స్ వంటివి ఉంటాయని పేర్కొన్నారు.
ఈ సదస్సులో ఎగ్జిబిషన్లో 175కుపైగా ఎగ్జిబిటర్స్ పాల్గొంటున్నట్టు చెప్పారు. ప్రత్యేకంగా స్టార్టప్ షోకేజ్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇన్నోవేటివ్ జోన్’ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో పాల్గొనేందుకు 400 కుపైగా నామినేషన్లు వచ్చాయని, అందులో నుంచి 75 స్టార్టప్లను ఎంపిక చేశామని తెలిపారు. వీరు తమ ఆలోచనలను ప్రదర్శిస్తారని, న్యాయ నిర్ణేతలు పరిశీలించి అందులో నుంచి 5 స్టార్టప్లను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ స్టార్టప్లు తమ ఆలోచనలను వివరించేందుకు ఒక్కొక్కరికి ఐదు నిమిషాల సమయం ఇస్తామని, తద్వారా అక్కడే ఉన్న పారిశ్రామిక వేత్తలకు, స్టార్టప్లకు మధ్య అనుసంధానం ఏర్పడుతుందని అన్నారు. విజేతగా నిలిచిన స్టార్టప్కు నగదు బహుమతి కూడా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అందుకోనున్న రాబర్ట్ ఎస్ లాంగర్ ఘనతలు ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ప్రపంచంలోని నంబర్ వన్ బయో మెడికల్ ఇంజినీర్ ఆయన. లాంగర్ 1948 ఆగస్టు 29న అమెరికాలోని న్యూయార్క్లో జన్మించారు. 1974లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ పట్టా అందుకొన్నారు. అప్పటి నుంచి పరిశోధనలు ప్రారంభించారు. బయోటెక్నాలజీ, మెడిసిన్ రంగాల్లో విశేష సేవలందించారు. శాస్త్రవేత్తగా, వ్యాపారవేత్తగా, ఆవిష్కర్తగా విశేష కృషి చేశారు. లాంగర్ పేరుమీద ప్రస్తుతం 1,400 పేటెంట్లు ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు 1,500 పరిశోధన పత్రాలు సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా బయోటెక్నాలజీ కంపెనీలను ఏర్పాటు చేయడంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మోడెర్నా కూడా ఒకటి. ఎంఐటీలో ఆయనకు ప్రత్యేకంగా ‘లాంగర్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ’ ఉన్నది. బయోకెమికల్ ఇంజినీరింగ్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాబొరేటరీ. ఇందులో 100కుపైగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ల్యాబ్కు ఏటా సుమారు 10 మిలియన్ డాలర్ల నిధులు సమకూరుతున్నాయి. లాంగర్కు ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు అందించాయి. ఇందులో ప్రఖ్యాత హార్వర్డ్, యేల్, కొలంబియా యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. 1996 నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో అవార్డులు అందుకొన్నారు. ఈ జాబితాలో జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు చేరనున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బయో ఏషియా సదస్సు విస్తృతి మరింత పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ వేదికగా సదస్సును నిర్వహిస్తూనే మరోవైపు ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్), అడ్వామెట్ (మినియా పోలిస్) 2015-16 వంటి అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం సామర్థ్యాన్ని వివరిస్తున్నామని చెప్పారు. అందుకు తగ్గ ఫలితాలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. వైద్య పరికరాలకు (మెడికల్ డివైజెస్) సంబంధించి అడ్వామెట్ పేరుతో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు 2015-16లో తాను హాజరై అంతర్జాతీయ సంస్థ ‘మెట్రానిక్’ ప్రతినిధులతో చర్చలు జరిపినట్టు గుర్తుచేశారు. ఆ చర్చల ఫలితంగానే ఇప్పుడు సంస్థకు చెందిన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్ అండ్ డీ కేంద్రం హైదరాబాద్కు వచ్చిందని చెప్పారు. గత ఏడాది స్విట్జర్లాండ్, నార్వే, థాయ్లాండ్, దక్షిణ కొరియా, అర్జెంటీనా, జర్మనీ, దక్షిణాఫ్రికా, స్పెయిన్, యూకే తదితర దేశాల నుంచి ప్రతినిధులు బయో ఏషియాకు హాజరయ్యారని, దీంతో ఆయా దేశాల్లోని ఎకో సిస్టంతో మనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపారు. బెల్జియంలోని ఫ్లాండర్స్, జపాన్లోని కొన్ని రాష్ర్టాలు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఒప్పందం చేసుకొన్నాయని వెల్లడించారు. ఇలా ప్రతి అవకాశాన్ని వాడుకొంటూ తెలంగాణ గురించి ప్రచారం చేస్తున్నామని చెప్పారు.