హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఐదంచెల వ్యూహం అమలు చేస్తున్నది. థర్డ్ వేవ్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటానికి అన్ని మార్గాలు అన్వేషించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ మరింత అప్రమత్తమైంది. సెకండ్ వేవ్లో విజయవంతమైన వ్యూహాల్ని మళ్లీ తెచ్చింది. టెస్టింగ్, జ్వరసర్వే, వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనితో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ముందస్తు అంచనాల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు 4,500 లోపే ఉంటున్నాయి.
వ్యూహం 1: టెస్టింగ్
అంతర్జాతీయంగా కరోనా నిర్ధారణ కిట్లకు కొరత ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో దాదాపు రెండు కోట్ల టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసింది. పీహెచ్సీ, యూపీహెచ్సీ, బస్తీ దవాఖానల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో రోజుకు సగటున 30 వేల పరీక్షలు నిర్వహిస్తే.. రెండోవారంలో 50-60 వేలకు పెంచారు. మూడోవారం నుంచి లక్షకు పైగా, ఈ నెల 18 నుంచి రోజూ 1.10 లక్షలకు పైగా టెస్టులు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 3.12 కోట్ల పరీక్షలు.. అంటే.. ప్రతి పది లక్షల మంది జనాభాకు 8.40 లక్షల పరీక్షలు చేయడం విశేషం.
వ్యూహం 2: వ్యాక్సినేషన్
మొదటి డోస్ పంపిణీ – 104%, రెండో డోస్ – 79%
15-17 ఏండ్ల మధ్య వయసు వారికి – 58%
రాష్ట్ర ప్రభుత్వం టీకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో 2.77 కోట్ల మందికి టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన మొదటి పెద్ద రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 5.20 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. 15 నుంచి 18 ఏండ్ల వయస్సు గ్రూపులోనూ సగం మందికి పైగా మొదటి డోస్ ఇచ్చారు. 2 లక్షల మందికి పైగా బూస్టర్ వేశారు. రోజూ రెండున్నర లక్షలకు పైగా టీకాలు వేస్తున్నారు.
వ్యూహం 3: జ్వర సర్వే, జ్వర ఓపీ
సెకండ్ వేవ్లో జ్వర సర్వే సత్ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడూ ఇంటింటా జ్వర సర్వే చేస్తున్నది. రోజూ సగటున 12 లక్షలకు పైగా ఇండ్లలో సర్వే చేస్తున్నారు. అనుమానితులకు అక్కడికక్కడే ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే దవాఖానకు పంపిస్తున్నారు.
వ్యూహం 4: అవగాహన
కరోనాపై ప్రజల్లో అలసత్వం పెరగకుండా ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ ప్రతి మీడియా సమావేశంలోనూ, ప్రజల్ని కలిసిన సందర్భంలోనూ కొవిడ్ జాగ్రత్తలు, టీకాల ఆవశ్యకతను గుర్తుచేస్తున్నారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
వ్యూహం 5: సన్నద్ధత
సెకండ్ వేవ్ అనుభవాలతో థర్డ్ వేవ్ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందే సిద్ధమైంది. ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 27,996 పడకలు ఉండగా 99% పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చింది. కొత్తగా 76 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేసింది. 540 టన్నుల ఆక్సిజన్ సరఫరాకు 27 కంటైనర్లను సిద్ధం చేసింది. రోజువారీ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 135 టన్నుల నుంచి 327 టన్నులకు పెంచింది. థర్డ్ వేవ్లో పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతారన్న అంచనాల మేరకు వారికి కోసం దాదాపు ఆరు వేల పడకలను సిద్ధంచేసింది.
ప్రభుత్వ చర్యలతో దవాఖానల్లో తగ్గిన చేరికలు
కరోనా మొదటి, రెండో వేవ్లో ప్రభుత్వ దవాఖానలు పెద్దన్న పాత్ర పోషించాయి. వేల ప్రాణాలను కాపాడాయి. రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో వసతులు పెంచడం వల్లే ఇది సాధ్యమైంది. సెకండ్ వేవ్లో కార్పొరేట్ దవాఖానల్లో లభించని ఖరీదైన మందులను ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ఇచ్చాం. థర్డ్వేవ్ సన్నద్ధతలో భాగంగా ప్రభుత్వ దవాఖానల్లో వసతులు మరింత మెరుగుపడ్డాయి. థర్డ్వేవ్లోనూ ప్రభుత్వ వ్యూహం ఫలిస్తున్నది. దవాఖానల్లో చేరికలు నామమాత్రంగా ఉంటున్నాయి.