హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): మహిళలను గౌరవించాలని ప్రధాని మోదీ ఎర్రకోట మీది నుంచి నిర్దేశించిన రెండు రోజులకే.. రేప్ కేసులో దోషులైన వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తన మాటల్లోని నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రేపిస్టులను విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి, వాళ్లను తిరిగి జైలుకు పంపడం ద్వారా ప్రధాని మోదీ తన చిత్తశుద్దిని, నిబద్ధతను దేశానికి చాటాలని సవాల్ చేశారు. గుజరాత్లో 2002లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో గ్యాంగ్రేప్కు గురైన బిల్కిస్ బానో కేసు లో దోషులను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
దేశం మొత్తం స్వతంత్ర భా రత వజ్రోత్సవాలు జరుపుకొంటున్న తరు ణంలో హేయమైన చర్యకు పాల్పడిన 11 మంది రేపిస్టులను విడుదల చేయడం బా ధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఐదునెలల గర్భిణి అయిన బిలిస్ బానోపై గ్యాంగ్ రేప్ చేసిన రేపిస్టులను విడుదల చేసి బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం తన హీన మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నదని మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వ చర్యతో వ్యవస్థల మీద నమ్మకం పోతున్నదని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రేపిస్టులను ఉరితీయాలి
చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని రేపిస్టులు తప్పించుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. రేప్ లాంటి నేరాలకు పాల్పడితే చనిపోయేదాక జైలు శిక్ష లేదా ఉరిశిక్ష విధించినప్పుడే లైంగికదాడులు ఆగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన లైంగికదాడి కేసులో నిందితులు మైనర్ అన్న ఒకే ఒక కారణంతో కఠిన శిక్ష నుంచి తప్పించుకున్నారని, బెయిల్ పొందారని తెలిపారు. మైనర్లు లైంగికదాడికి పాల్పడితే మూడేండ్లకు మించి శిక్ష విధించే అవకాశం ప్రస్తుత చట్టాలతో లేదన్నారు. రేప్ లాంటి దుశ్చర్యలకు పాల్పడే మైనర్లను మేజర్లుగానే పరిగణించి ఆ మేరకు కఠిన శిక్షలు విధించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బలమైన చట్టాలు ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని, మన సమాజం, మన పిల్లలకు మంచి జరగాలంటే భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర స్మృతి (సీఆర్పీసీ), జువెనైల్ జస్టిస్ చట్టానికి సవరణలు చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. రేపిస్టులకు న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వకుండా చూడాలని ప్రధానిని కోరారు. రాజకీయంగా ఎన్ని విభేధాలు ఉన్నా, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమ సహకారాన్ని అందిస్తామని తెలిపారు.