స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ ముక్త్ భారత్ లక్ష్యంగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నది. మూడు రాష్ర్టాల సీఎంలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు సీఎం కేసీఆర్తో వేదికను పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ కేసీఆర్ ఇచ్చిన నినాదం ఉత్తరాది నాయకుల మనసులను గెలుచుకొన్నది. ఖమ్మం సభ తర్వాత సీఎం కేసీఆర్తో పలు రాష్ర్టాల నేతలు భేటీ అవుతున్నారు. ఒడిశా పీసీసీ కార్యదర్శి తన పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన మరికొన్ని పార్టీల నేతలు, ఈశాన్య రాష్ర్టాలకు చెందిన నేతలు కేసీఆర్ను వరుసగా కలుస్తున్నారు. మొత్తమ్మీద బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ఆయా రాష్ర్టాల నేతలతో పాటు వారి పార్టీ క్యాడర్ కూడా బీఆర్ఎస్లో చేరటానికి సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కేసీఆర్ను దక్షిణాది నేత గా ఇంతకాలం చూస్తూ వచ్చిన ఉత్తరాది మీడియా, ఖమ్మం సభ తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నది. సమాజ్ వాదీ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు ఖమ్మం సభలో పాల్గొనడం, లక్షలాది జనం ఆ సభకు హాజరవ్వటంతో ఉత్తర భారతంలోని ప్రముఖ హిందీ, ఉర్దూ దినపత్రికలు ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. పతాక శీర్షికలుగా ప్రచురించాయి. అంతేకాకుండా హిందీ, ఇంగ్లిష్, ఒడియా, గుజరాతీ, మరాఠీ భాషలకు చెంది న ప్రముఖ కాలమిస్టులు సైతం కేసీఆర్ ప్రస్థానంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కరణ్ థాపర్, వీర్ సింఘ్వీ, కూమీ కపూర్ శీలా భట్ లాంటి ఉద్దండ జర్నలిస్టులు సైతం కేసీఆర్ రాజకీయ పంథాపై చర్చించడం మొదలైంది. 2023 ప్రథమార్ధంలోనే బీజేపీని ఢీకొట్టే దీటైన శక్తిగా బీఆర్ఎస్ను కేసీఆర్ రూపొందించబోతున్నారని దిగ్గజ సంపాదకులతో పాటు టీవీ చర్చల్లో పాల్గొనే ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఎర్రకోటపై గులాబీ జెండా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేవని ఉత్తరాది నాయకులు సైతం భావిస్తున్నారు.
జాతి ప్రయోజనాల కోసం విపక్ష నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ముందుకు సాగితే చూడాలని ఉందని, తనకింక ఏ కోరికా లేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు నితీశ్ హాజరుకాకపోవడంపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ సభకు సంబంధించిన సమాచారం తనకు లేదన్నారు. ఒక వేళ సమాచారమున్నా తాను వెళ్ళలేక పోయేవాడినని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సావధాన్ యాత్ర తదితర కార్యక్రమాల్లో తాను తలమునకలైనట్టు వివరించారు.
ఖమ్మం సభకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాకపోవడంపై జరుగుతున్న ప్రచారం మీద ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తాను ఈ విషయంపై నితీశ్తో ప్రత్యేకించి మాట్లాడానని చెప్పారు. సమాచార లోపం వల్లే నితీశ్ సభకు హాజరు కాలేకపోయారని అఖిలేశ్ వివరించారు. సీఎం కేసీఆర్పై, ఆయన నాయకత్వంపై నితీశ్కు అపార గౌరవమున్నదని పేర్కొన్నారు.