దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్
ఉత్పత్తి సామర్థ్యం 100 మెగావాట్లు
ఏటా 1.65 లక్షల టన్నుల బొగ్గు పొదుపు
1.11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలకు చెక్
32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఆదా
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పురుడు పోసుకొన్నది. నీటిపై తేలియాడే ఈ విద్యుత్తు ప్లాంట్ నిర్మాణం పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో జరిగింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)లోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్పై దీన్ని నిర్మించారు. 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును బీహెచ్ఈఎల్ నిర్మించింది. రూ.430 కోట్లతో 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మాణం జరిగింది. దీనిలో 4.5 లక్షల సోలార్ ప్యానళ్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు చివరి దశలో భాగమైన 20 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం శుక్రవారం పూర్తయింది. దీంతో దేశంలోనే 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్తు ప్లాంట్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ కీర్తికెక్కింది.
అత్యాధునిక సాంకేతికత, గరిష్ఠ ప్రయోజనాలు
పర్యావరణ అనుకూలమైన ఈ ప్రాజెక్టును అత్యాధునిక సాంకేతికతో నిర్మించారు. ఒక్కొక్కటి 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 40 బ్లాకులను ప్రత్యేకంగా విభజించి నిర్మాణం చేపట్టారు. ప్రతి బ్లాక్లో ఒక ఫ్లోటింగ్ ప్లాట్ఫాం, 11,200 సోలార్ మాడ్యూళ్ల శ్రేణి ఉన్నది. ప్రతి ఫ్లోటింగ్ ప్లాట్ఫాంలో ఒక ఇన్వర్టర్, ట్రాన్స్ఫార్మ్, ఒక హెచ్టీ బ్రేకర్ ఉంటాయి. సోలార్ మాడ్యూళ్లను హెచ్డీపీఈ (హైడెన్సిటీ పాలిథిలీన్) మెటీరియల్తో తయారు చేసిన ఫ్లోటర్లపై ఉంచారు. మొత్తం ఫ్లోటింగ్ సిస్టమ్ను ప్రత్యేక హెచ్ఎంపీఈ (హై మాడ్యులస్ పాలిథిలీన్) తాడు ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బెడ్లోని డెడ్ వెయిట్లకు లంగరు వేస్తారు. ప్రస్తుతం స్విచ్యార్డు వరకు 33 కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్తును తరలిస్తున్నారు. ఇన్వర్టర్, ట్రాన్స్ఫార్మర్, హెచ్టీ ప్యానల్, ఎస్సీఏడీఏ (పర్యవేక్షణ, నియంత్రణ, డాటా సేకరణ వ్యవస్థ) సహా అన్ని ఎలక్ట్రికల్ పరికరాలు తేలియాడే ఫెర్రో సిమెంట్ ప్లాట్ఫారాలపైనే ఉంటాయి.
ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో లాభాలు
గతంలో ఎన్టీపీసీ కేరళలోని కాయంకుళంలో 92 మెగావాట్లు, ఏపీలోని విశాఖ సింహాద్రి థర్మల్ స్టేషన్లో 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను నిర్మించింది. ఈ ప్లాంట్లలో సోలార్ ప్యానల్స్ మాత్రమే నీటిపై తేలియాడుతూ ఉంటాయి. సోలార్ ప్యానళ్లతోపాటు విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాకు ఉపయోగించే అన్ని యంత్రాలు, పరికరాలు నీటిపైనే తేలియాడుతూ ఉండటం రామగుండం ప్లాంట్ ప్రత్యేకత. రిజర్వాయర్ ఉపరితలంపై సోలార్ ప్యానళ్లను కప్పడం వల్ల ఏటా 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఆవిరి కాకుండా పొదుపు అవుతుంది. ఇది 45 వేల కుటుంబాలు ఒక ఏడాదిపాటు వినియోగించే నీటికి సమానం. అంతేకాకుండా ఈ ప్లాంట్ ద్వారా 100 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన 1.65 లక్షల టన్నుల బొగ్గు వాడకాన్ని తగ్గించినట్టవుతుంది. తద్వారా ఏటా 1.11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను అడ్డుకొన్నట్టే. పగటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు నేలపై నిర్మించిన సౌరశక్తి కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. అదే నీటిపై తేలియాడే ప్లాంట్లో నీటి చల్లదనం కలిసి వస్తుంది. తద్వారా సామర్థ్యానికి మించి అదనంగా మరో 5% మేర విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉంటుంది.
దక్షిణాది ప్రాధాన్యం పెరిగింది
రామగుండంలోని ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్తో దేశంలో దక్షిణాది ప్రాముఖ్యం మరింత పెరిగింది. ఈ ప్లాంట్ తో దక్షిణ భారతదేశంలోని ఫ్లోటింగ్ సోలార్ పవర్ కెపాసిటీ 217 మెగావాట్లకు వృద్ధి చెందింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం మరువలేనిది. కరోనా నేపథ్యంలో కాస్త ఆలస్యమైనా అనుకున్న సమయానికే ప్లాంట్ పూర్తయింది. ఎన్టీపీసీ పనితీరుకు, సిబ్బంది నిబద్ధతకు ఇదో నిదర్శనం. ఇదే స్ఫూర్తితో రామగుండం ప్లాంట్ను మరింత అభివృద్ధి చేయాలి. – నరేశ్ ఆనంద్,
రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎన్టీపీసీ)