నిజామాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్కు భారీ షాక్ తగిలింది. జిల్లాలోని నందిపేటలో వాళ్లు పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట బీజేపీ ఎంపీటీసీతో పాటు, బీజేపీ నాయకత్వం మొత్తం టీఆర్ఎస్ పార్టీలో చేరింది.
ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో నందిపేట ఎంపీటీసి-2 అరుణ చావన్ గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఎంపీ బండి సంజయ్ను, ఆ పార్టీ కార్యకర్తలే నమ్మకం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది.
ఇటీవల ఆర్మూర్లో పర్యటించిన ఎంపీ అరవింద్ను స్థానిక పసుపు రైతులు అడ్డుకున్నారు. పసుపు బోర్డు హామీని నెరవేర్చాలంటూ ఎంపీ అరవింద్ ను నిలదీసారు. దీంతో కొందరు అరవింద్ మనుషులు రైతులపై దాడికి ప్రయత్నించారు.
అయితే అరవింద్ను అడ్డుకున్న పసుపు రైతులను బండి సంజయ్ ఖలిస్తాన్ తీవ్రవాదులతో పోల్చారు. కాగా, రైతులను ఉగ్రవాదులతో పోల్చి రాజకీయ లబ్ధి కోసం తమ గ్రామంలో పర్యటించిన బండి సంజయ్ తీరును గ్రామ బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు.
బీజేపీ రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా గ్రామ ఎంపీటీసీ, ఇతర బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. తమను ఎంపీ అరవింద్ తీవ్రంగా మోసం చేసారని రైతులు అవేదన వ్యక్తం చేశారు.
పసుపు బోర్డు పేరుతో గెలిచి, రైతులను తీవ్రంగా మోసం చేసిన ఎంపీ అరవింద్, బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్ కూడా రాదని రైతులు హెచ్చరించారు.
కార్యక్రమంలో నందిపేట్ జెడ్పిటిసి యమున, ఎంపీటీసీ మురళి, టీఆర్ఎస్ పార్టీ నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, అయిలాపూర్ సుదర్శన్, సిలిండర్ లింగం తదితరులు పాల్గొన్నారు.