హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లోని బొగ్గు, బూడిద ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం జెన్కో టెండర్లను ఆహ్వానించడంతో మూడు సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో ఎల్1గా నిలిచిన ‘పవర్మెక్’ కంపెనీకి ఈ ప్లాంట్లను అప్పగించబోతున్నారు. ఈ సంస్థతో ఇప్పటికే జెన్కో అధికారులు సంప్రదింపులు జరిపారు. మూడేండ్ల కాలానికి రూ.279 కోట్లతో టెండర్లు ఖరారు చేసినట్టు జెన్కో వర్గాలు చెప్తున్నాయి. ఇందులో రూ.72 కోట్ల స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గతంలో వైటీపీఎస్ కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు జెన్కో టెండర్లను ఆహ్వానించింది.
అనంతరం వాటిని రూ.34.50 కోట్లతో 6 నెలలపాటు ఔట్సోర్సింగ్కు ఇచ్చారు. ఈ లెక్కన ఇప్పుడు మూడేండ్ల కాలానికి రూ.207 కోట్లతో టెండర్లు ఖరారవుతాయని అధికారులు అంచనాలు వేశారు. కానీ, ఈ ప్రతిపాదనలు విద్యుత్తు సౌధకు చేరగానే అంచనాలను రూ.255 కోట్లకు పెంచారు. ఆ తర్వాత ‘పవర్మెక్’ కంపెనీ 10.5% అధికంగా రూ.281.77 కోట్లకు టెండర్ దాఖలు చేసింది. దీంతో అంచనాలు రూ.75 కోట్లు పెరిగి రూ.281 కోట్లకు చేరాయి. చివరికి జెన్కో అధికారులు సంప్రదింపులు జరుపడంతో రూ.279 కోట్లకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఇది ప్రాథమిక అంచనా కంటే రూ.72 కోట్లు, జెన్కో అధికారుల అంచనా కంటే రూ.24 కోట్లు అధికం. అంచనాలు ఇలా దశలవారీగా ఎందుకు పెరిగాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. దీని వెనుక భారీ స్కామ్ జరిగిందని విద్యుత్తుసౌధలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అవసరానికి మించి 263 మంది
వైటీపీఎస్లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణకు 1,650 మంది సిబ్బంది అవసరం. కానీ, 1,913 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది కోసం టెండర్లు పిలిచారు. దీంతో అవసరానికి మించి 263 మంది సిబ్బందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకునేందుకు టెండర్లు పిలువడం అనుమానాలకు తావిస్తున్నది. వాస్తవానికి వైటీపీఎస్ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ పలు పనులు పెండింగ్లో ఉన్నాయి. ఐదో యూనిట్లో వాణిజ్య కార్యకలాపాలు (కమర్షియల్ ఆపరేషన్ డేట్) ఇంకా ప్రారంభంకాలేదు. ఈపీసీ కాంట్రాక్టర్ అయిన బీహెచ్ఈఎల్ ఈ ప్లాంట్ను ఇంకా జెన్కోకు అప్పగించలేదు. అయినప్పటికీ కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు తొందరపాటుతో టెండర్లు ఖరారు చేయడం వెనుక ఏదో మంత్రాంగం జరిగే ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఖాళీలు భర్తీ చేయకుండానే..
వైటీపీఎస్లో కోల్, యాష్ హ్యాండ్లింగ్కు అవసరమైన 1,650 మంది సిబ్బందిలో ప్రస్తుతం 1,254 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో ఇంజినీరింగ్ విభాగంలో 74, ఓఅండ్ఎం విభాగంలో 322 మంది సిబ్బంది కొరత ఉన్నది. ఇతర ప్లాంట్ల నుంచి ఏఈలు, ఏడీఈలను బదిలీ చేయడం, అర్హులైన ఏఈలకు ప్రమోషన్లు కల్పించడం ద్వారా ఈ లోటను భర్తీ చేయవచ్చు. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో కోల్, యాష్ ప్లాంట్లను జెన్కో ఇంజినీర్లు, డిపార్ట్మెంటల్ వర్మెన్ , ఔట్సోర్సింగ్ ఏజెన్సీ సిబ్బంది సహకారంతో నడుపుతున్నారు.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)లో యాష్, కోల్ ప్లాంట్లను ఇంజినీర్లే పర్యవేక్షిస్తున్నారు. కేవలం బొగ్గు, బూడిదను తరలించే పనులను మాత్రమే ఔట్సోర్సింగ్కు ఇచ్చారు. కానీ, వైటీపీఎస్లో ఇంజినీర్ల పనులు మొదలుకొని అన్ని పనులను ఔట్సోర్సింగ్కు ఇవ్వాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో వైటీపీఎస్లోని కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థకు అప్పగించే నిర్ణయంపై పునరాలోచించాలని, సిబ్బంది అవసరం, టెండర్ అంచనాల పెంపుపై ప్రభుత్వం విచారణ జరుపాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అలా కాకుండా అధిక మొత్తానికి టెండర్లు ఖరారుచేస్తే మెరుపు సమ్మెకు దిగుతామని జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు.