AIIMS Bibinagar | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్.. కేవలం బీజేపీ ప్రచారానికే అని మరోసారి తేటతెల్లం అయ్యింది. పేదలకు వైద్యం అందించాల్సిన దవాఖానలను సైతం బీజేపీ తన స్వార్థానికి వాడుకొన్నదనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది. తెలంగాణకు ఎయిమ్స్ను మంజూరు చేశాం తప్ప..దాని నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం గమనార్హం. బీబీనగర్ ఎయిమ్స్కు విడుదల చేసిన నిధులపై ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా సమాచారం ఇచ్చింది.
అరకొర నిధులే..: బీబీనగర్లో ఎయిమ్స్ నిర్మాణానికి 2018 డిసెంబర్ 17న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లతో అత్యాధునిక వసతులతో దవాఖానను నిర్మిస్తామని డబ్బా కొట్టుకొన్నది. 2022 నాటికి పూర్తి చేస్తామని గొప్పగా ప్రకటించుకొన్నది. కానీ.. 2022 జూలై వరకు కనీసం పనులు మొదలుపెట్టలేదు. దీంతో కేంద్రం గడువును 2024 అక్టోబర్కు పొడిగించింది. అంచనాలను రూ.1,365. 95 కోట్లకు పెంచింది. అంటే.. సుమారు 340 కోట్లు అదనం. ఇందులో ఇప్పటివరకూ కేంద్రం విడుదల చేసిన నిధులు కేవలం రూ.156 కోట్లు. అంటే మొత్తం అంచనాల్లో 11.4 శాతం. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణలోని ఎయిమ్స్కు వంద రూపాయలు కావాల్సిన చోట కేవలం రూ.11 విడుదల చేసి చేతులు దులుపుకొన్నది. వైద్యం విషయంలోనూ తెలంగాణకు మొండిచెయ్యి చూపింది.
ఎయిమ్స్ మంజూరై ఐదేండ్లు గడుస్తున్నా కనీసం ఒక్క భవనం నిర్మాణం పూర్తి కాలేదు. మొత్తం పనుల్లో 5 శాతం మాత్రమే జరిగాయి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భవనాల్లోనే తాత్కాలికంగా కళాశాల, వైద్యశాల నడుస్తున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని కేంద్రం చెప్తున్నది. ఇంకా 20 నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. 20 నెలల్లో 88 శాతం నిధులు విడుదల చేసి.. 95 శాతం పనులు పూర్తి చేయడం అసా ధ్యం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కంటితుడుపుగా నిధులు ఇచ్చి ప్రచారం చేసుకోవడం తప్ప.. కేంద్రానికి బీబీనగర్ ఎయిమ్స్ను ఈ జన్మలో పూర్తి చేసే ఉద్దేశం లేదని స్పష్టం అవుతున్నదని విశ్లేషకులు మండిపడుతున్నారు.