BJP | ఆదిలాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల అడుగడుగునా వివక్షను చూపుతున్నది. గత పదేండ్లలో నిధులు విడుదల-కేటాయింపు, ప్రాజెక్టుల మంజూరులో తెలంగాణ పట్ల శీతకన్ను ప్రదర్శిస్తున్నదన్న విమర్శలు నిత్యం వ్యక్తమవుతూనే ఉన్నాయి. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోగా.. ఇంతవరకు పెండింగ్ ప్రాజెక్టుల ఊసే ఎత్తడం లేదు. బడ్జెట్లో కేటాయింపులు అసలే లేకుండా పోతున్నాయి.
మహారాష్ట్రలో నాలుగు వరుసలు
ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు నుంచి బేల మీదుగా జైనథ్ మండలం భోరజ్ వరకు జాతీయ రహదారి నం.353బీ 32.97 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయించింది. కానీ ఈ మార్గంలో వాహనాల సంఖ్య తక్కువగా ఉన్నదనే నెపంతో దానిని రెండు వరుసలకు మార్చింది. ఇదే రహదారి జిల్లా సరిహద్దు ఉపసనాల వరకు మహారాష్ట్ర పరిధిలో నాలుగు వరుసలుగా పనులు కొనసాగుతున్నాయి. ఈ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయి. రూ.375 కోట్లతో నిర్మించే ఆదిలాబాద్ నుంచి బేల రెండు వరుసల విస్తరణ పనులను ప్రధాని సోమవారం ప్రారంభించనున్నారు. ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని గతంలో బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించాయి.
సిమెంటు పరిశ్రమ హామీలకే పరిమితం
ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛగా ఉన్న సిమెంటు పరిశ్రమ (సీసీఐ) పునః ప్రారంభం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. తెలంగాణలో మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018, నవంబర్ 28న ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఐదున్నర ఏండ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన హన్స్రాజ్ గంగారాం సీసీఐని సందర్శించి తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గతేడాది అక్టోబరు 9న ఆదిలాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా పరిశ్రమ పునఃప్రారంభంపై కనీసం మాట్లాడలేదు. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, భూములు కోల్పోయిన రైతులు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు ఆందోళనలు జరిపినా ఫలితంలేదు.
ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్ నిధులేవి?
కేంద్రం 2009-10 రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు వరకు రైలు మార్గాన్ని మంజూరు చేసింది. ఇందుకు నిర్మాణ వ్యయం రూ.3,771 కోట్లు భారీగా అవుతుండడంతో తక్కువ ఖర్చుతో ఆర్మూర్ లైన్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఆదిలాబాద్-ఆర్మూర్ లైన్కు 2017 బడ్జెట్లో మంజూరు లభించింది. అధికారులు రూ.2,990 కోట్లు ఖర్చవుతాయని అంచనాలు వేశారు. కానీ ఇంతవరకు ఈ మార్గానికి నయా పైసా కూడా కేటాయించలేదు.
విమానాశ్రయం మరిచారు..
ఉడాన్ పథకం కింద ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలు నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలున్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఎయిర్పోర్టు ఆధారిటీ ఆఫ్ ఇండియాను కోరింది. అధికారుల బృందం ఎయిర్పోర్టు మైదానాన్ని పరిశీలించి సానుకూల నివేదికలు అందజేసింది. ఎయిర్పోర్టు నిర్మాణం తో స్థానిక అభివృద్ధితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. కానీ ఈ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధాని ఇప్పటికైనా తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధులు, ప్రాజెక్టుల విషయంలో సానుకూలమైన ప్రకటన చేయాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.