యాదాద్రి భువనగిరి, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. తన నివాసం, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభించలేదని, తమ దగ్గరి నుంచి అధికారులు ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. ఊహాగానాలతోనే అధికారులు దాడులు నిర్వహించారని చెప్పారు. ఒక్క రోజులో పూర్తయ్యేదానికి మూడు రోజులు తనిఖీలు చేపట్టారని ఆరోపించారు. ఇంట్లో కుటుంబ సభ్యులు, పిల్లలు ఉన్నారని, మూడు రోజులపాటు సోదాలు చేయడం సరికాదని సూచించారు.
హైదరాబాద్లో ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల అనంతరం ఆదివారం భువనగిరికి చేరుకున్న ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో పైళ్ల శేఖర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొత్తం 70 ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. దాడుల్లో ఎంతో లభిస్తాయని ఐటీ అధికారులు అనుకున్నారని, ఏం దొరక్కపోవడంతో షాక్ తిన్నారని చెప్పారు.
ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నకు స్పష్టంగా సమాధానం ఇచ్చానని, అన్ని విషయాల్లో సహకరించినట్టు తెలిపారు. తన మామ మోహన్రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారని, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారనే వార్తలు అవాస్తవమని తెలిపారు. తనకు దక్షిణాఫ్రికాలో మైన్స్ బిజినెస్ ఉన్నట్టు మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని, అలాంటి వ్యాపారాలు తనకు లేవని స్పష్టం చేశారు. తనను బద్నాం చేసేందుకు కొందరు ప్రయత్నించారని విమర్శించారు.