CM KCR | బీఆర్ఎస్ రాజకీయాల కోసం కాకుండా.. ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరికి చెందిన డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాజకీయం కోసం కాదు.. ఒక లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలిపారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్భవించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. గతంలో ఎంతోమంది చాలా పెద్దలు ఉద్యమంలో పని చేశారని, ఎందరో త్యాగాలు చేశారన్నారు. ఆ తర్వాత ఉద్యమం నీరుగారిపోయినా.. మళ్లీ స్టార్ట్ చేసి కొట్లాడామని, ఇదంతా కండ్ల ముందు జరిగిన చరిత్ర అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నామని, భగవంతుడి దయ, తెలంగాణ ప్రజల అదృష్టంతో చాలాగొప్పగా రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు. అప్పుడు చాలా తికమక పెట్టారని, హైదరాబాద్ విషయంలో కాంప్రమైజ్ కావాలని కావాలన్నారని.. హైదరాబాద్ లేని తెలంగాణ ఎందుకు..? తలకాయలేని మొండెం ఇస్తే మాకెందుకు ప్రాణం పోయినా ఒప్పుకోమని చెప్పి.. చివరకు హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కలబడి, పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలన్నారు. రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని, గతంలో ఎంతో మంది సీఎంలు పని చేసినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోయారన్నారు. గతంలో ఎక్కడ చూసినా ఇన్వర్టర్లు, జనరేట్లు ఉండేవని, ప్రస్తుతం నాణ్యమైన 24 గంటల విద్యుత్ను సరఫరా చేస్తున్నామన్నారు.
24 గంటల విద్యుత్ ఇవ్వడానికి అధికారులతో మాట్లాడానని, కరెంటును కొనాల్సి వస్తుందంటే ఎంత ఖర్చయినా పర్వాలేదని చెప్పినట్లు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు. మూడు గంటల విద్యుత్ అంటే రైతులు తిట్టుకుంటున్నారన్నారు. 24 గంటల కరెంటు ఇస్తే ఎవరికి అవసరమున్నప్పుడు వాళ్లు వాడుకుంటారని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. 24 గంటల కరెంటు సరఫరాతో రాష్ట్రంలో మూడు పంటలు పండుతున్నాయని, గతంలో వడ్లు తీసుకుపోయి మార్కెట్లలో ఎదురు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు కళ్లాల వద్దనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు.
ఇవాళ రోడ్లకు ఇరువైపులా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని, రైస్ మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయన్నారు. రూ.80వేలకోట్టు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిపోయిందని చెప్పారు. ధరణి పోర్టల్ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని, ధరణి పోర్టల్లో భూములను డిజిటలైజ్ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా ఉందని, ధరణి ద్వారా యజమానులు మాత్రమే భూమి మార్చగలరన్నారు. ధరణితోనే రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగాయని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి మెరుగుపడిందన్నారు. రైతుల సంక్షేమానికి రైతుబంధు, బీమా అమలు చేస్తున్నామని, ధరణి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమవుతుందన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు నిధులు ఎలా జమవ్వాలని ప్రశ్నించారు.