వెంకటాపూర్/తాడ్వాయి/భూపాలపల్లి టౌన్, జూలై 29: జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరదలో గల్లంతైన నలుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంటకు చెందిన సాద లక్ష్మి (65) గురువారం గల్లంతైంది. శనివారం గ్రామ సమీపంలోని బిలుగుకుంట కాల్వలో ఆమె మృతదేహం కనిపించింది. తాడ్వాయి మండలం గోనెపల్లికి బాడిశ నందయ్య (55) మేడారం జంపన్నవాగు సమీపంలో కాపలాదారుగా ఉంటున్నాడు. బుధవారం రాత్రి వరద ఉధృ తికి నిద్రలోనే కొట్టుకుపోగా, శనివారం చిలుకలగుట్ట సమీపంలో మృతదేహం దొరికింది.
భూపాలపల్లి జిల్లా మోరంచ వరద ఉధృతిలో మోరంచపల్లికి చెందిన గడ్డం మహాలక్ష్మి, గంగిడి సరోజన, గొర్రె ఓదిరెడ్డి(70), గొర్రె వజ్రమ్మ(62) గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు శనివారం డ్రోన్ ఆపరేషన్ చేపట్టి గొర్రె ఓదిరెడ్డి మృతదేహాన్ని చిట్యాల మండలం పాశిగడ్డతండా సమీప వాగులో, గంగిడి సరోజన మృతదేహాన్ని మోరంచపల్లి సమీపంలో కనుగొన్నారు. ఓదిరెడ్డి భార్య వజ్రమ్మ, గడ్డం మహాలక్ష్మి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
రేగొండ, జూలై29: వరద బాధితులకు భూపాలపల్లి జిల్లా రేగొండ ఎస్సై శ్రీకాంత్రెడ్డి అందించిన సేవలను డీజీపీ అంజనీకుమార్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. ఇటీవల కురిసిన వర్షాలతో మోరంచపల్లి పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. జిల్లా ఆధికారుల ఆదేశాల మేరకు రేగొండ ఎస్సై శ్రీకాంత్రెడ్డి తన సిబ్బందితో అక్కడికి వెళ్లి వరదలో చిక్కుకున్న ప్రజలను, పశువులను ఒడ్డుకు చేర్చి కాపాడారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి పునరావాస కేంద్రాల్లో సేవలు అందించి ప్రజలకు అండగా నిలిచారు.