Bhu Bharati | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో నిర్లక్ష్యం బయటకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన అప్లికేషన్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి.. ఏకంగా దరఖాస్తులను క్యాన్సిల్ చేసేశారు. దీంతో అయోమయంలో పడిపోయిన రైతన్నలు తమ సమస్యలను పరిష్కరించాలని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో భూమి సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 60 వేల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే మిగిలిన దరఖాస్తులను ఎటువంటి కారణం లేకుండానే క్యాన్సిల్ చేసేశారు. దీంతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తమ దరఖాస్తు క్యాన్సిల్ చేశారని చెబితే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
రెవెన్యూ అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరైన కారణం చెప్పకుండా దరఖాస్తులు తిరస్కరించడమేంటని మండిపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో స్వీకరించిన దరఖాస్తులను కనీసం పోర్టల్లో కూడా అప్లోడ్ చేయలేదని ఆరోపిస్తున్నారు.