హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యింది. ఫిబ్రవరి 5న కోకాపేట, 6న ఉప్పల్ భగాయత్, పిర్జాదిగూడలో ఆయా సంఘాలతో సామూహికంగా భూమిపూజలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.బుధవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో 32 బీసీ కుల సంఘాల ప్రతినిధులతో పాటు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలుధపాలుగా బీసీ సంఘాలతో సమావేశమై 32 బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చామని వివరించారు. కోకాపేట్, ఉప్పల్ భగాయత్ లో కేటాయించిన వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల్లో అన్ని పనులు పూర్తిచేసుకొని నిర్మాణాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత చరిత్రలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 41 బీసీ కులాల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ అత్యంత విలువైన స్థలాలను హైదరాబాద్లో కేటాయించారని వివరించారు.
ఆర్డర్లు పొందిన సంఘం మార్చి 31లోగా స్లాబులు పూర్తయ్యేలా నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. ఇప్పటికే అనుమతి పత్రాలు పొందిన ఏ బీసీ కులమైన గడువులోగా ముందుకు రాకపోతే ప్రభుత్వమే నిర్మాణాలను చేపడుతుందన్నారు. మిగతా సంఘాలు సైతం త్వరలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు .
ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని బీసీ ఆత్మగౌరవ భవనాలు దసరాకు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆత్మగౌరవ భవనాల్లో కళ్యాణవేదికలు, సమావేశ మందిరాలు, విద్యార్థులకు హాస్టళ్లు, రిక్రియేషన్ తదితర అన్ని సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
మౌళిక వసతుల కోసం అడ్హక్ కమిటీ
బీసీ ఆత్మగౌరవ భవనాల ప్రాంగణాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌళిక వసతులను సైతం ఈనెలా ఖరులోగా పూర్తి చేసేందుకు అడ్హక్ కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో పాటు, హెచ్ఎండీఏ, విద్యుత్, వాటర్ వర్క్స్, ఆర్ అండ్ బీ తదితర అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి నిర్ణిత కాలంలో పనుల పూర్తి్కి చర్యలు తీసుకోవాలన్నారు. ఏక సంఘంగా ఏర్పడిన బీసీ కుల సంఘాలు నిర్మించుకునే భవనాలకు సైతం శాఖపరంగా అన్ని పనులు చూసుకునేందుకు లైజనింగ్ ఆఫీసర్లను సైతం నియమించామని వివరించారు.
నిర్మాణం కోసం ఎలాంటి ఇబ్బందులున్నా సంబంధిత కులసంఘాలు నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ బండాప్రకాశ్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం, రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎస్.తిరుపతి రావు, మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ నర్సింహారెడ్డి, టీఎస్ఈ డబ్ల్యూఐడీసీ సీఈ అనిల్, రంగారెడ్డి ఈఈ కుమార్ గౌడ్, హెచ్ఏండీఏ డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్ ముంతాజ్, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మల్లయ్య బట్టు, చంద్రశేఖర్, సంధ్య, విమల, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.