శ్రీశైలం : భారతీయ సనాతన హిందూ ధర్మ ఆచార సాంప్రదాయాలు ఎంతో విలువైనవని.. వీటిని పసితనం నుండే చిన్నారులకు అలవాటు చేయాలని ఈవో లవన్న సూచించారు. శుక్రవారం భోగిపండుగ సందర్బంగా ఆలయ ప్రాకారంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఐదు సంవత్సరాలలోపు గల చిన్నారులకు భోగిపండ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఆశిస్సుతో చిన్నారులకు బంగారు భవిష్యత్తు కలిగాలని కాంక్షిస్తూ అర్చక వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించారు. భోగి పండుగ రోజున రేగు, చెరకు వంటి పండ్లను పసిపిల్లల తలపై పోయడంతో బ్రహ్మరంధ్రం ప్రేరేపింపబడి ఙ్ఞానవంతులవుతారని, అదే విధంగా దృష్టి లోపాలు, చీడపీడలు తొలగిపోయి ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని ప్రధానార్చకులు మార్కండేయ శర్మ, భద్రయ్యలు తెలిపారు. కార్యక్రమంలో సుమారు 60 మందికిపైగా చిన్నారులు పాల్గొన్నారు.