మధిరటౌన్, సెప్టెంబర్ 17 : కొంతమంది తమ అవసరాల నిమిత్తం చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను నమ్మించజూస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. సెప్టెంబర్ 17 ఆవశ్యకతను, ఆ నాటి చరిత్ర పోరాటాల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. శనివారం ఖమ్మం జిల్లాలోని మధిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. ఆ నాడు సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం.. రైతులు, సామాన్య ప్రజలు భూస్వాములపై పోరాటం చేశారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ నాటి స్టేట్ సెక్రటరీగా జమలాపురం కేశవరావు ప్రధాన పాత్ర పోషించిన విషయాన్ని గుర్తుచేశారు.
నాటి చరిత్ర నేటి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉన్నదన్నారు. అంతేగానీ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం సరికాదని, ఈ విషయంలో బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు, జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పోరాటాలు జరిగాయని తెలిపారు. హైదరాబాద్ స్టేట్ భారత దేశంలో విలీనమైన సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందని, అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంత ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. అవసరమైతే గత చరిత్రపై తెలంగాణ పోరాటాలపై అవసరమైతే శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తానని భట్టి పేర్కొన్నారు.