Bhatti Vikramarka | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రైతులకు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన మాట నిజమే కానీ, వంద రోజుల్లో అని చెప్పలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ. 2 లక్షల వరకు పం ట రుణాలను మాఫీ చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు భట్టి ఇలా సమాధానమిచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ‘విద్యుత్తు-తాగునీరు-ఆర్థికం’ అంశాలపై భట్టి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. రైతుబంధు కోసం గత ప్రభుత్వం రూ. 7 వేల కోట్లను అకౌంట్లో వేసిందన్న దాంట్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రిజర్వుబ్యాంకు వద్దనున్న రికార్డుల ప్రకారం గత ప్రభుత్వం తమకు రూ. 3,690 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ర్టాన్ని అప్పగించిందని వివరించారు. అందుకు సంబంధించి రిజర్వుబ్యాంకు పత్రాలను మీడియాకు చూపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబంధుకు రూ. 7 వేల కోట్లు కేటాయించామని, ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే రైతుల ఖాతాల్లో వేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని, మరి ఆ రూ. 7 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ డబ్బులు ఎక్కడికి? ఎవరికి ఖాతాల్లోకి వెళ్లాయని నిలదీశారు. ఆ సొమ్ము ఎవరి దగ్గర ఉందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ నాలుగు నెలల్లో వడ్డీలు, అప్పులతో కలిపి మొత్తం రూ.26,374 కోట్లు చెల్లించినట్టు వివరించారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని, తాము రూపాయి రూపాయి పోగేసి ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షన్దారులకు వేతనాలు, పింఛన్లు చెల్లిస్తున్నట్టు తెలిపారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది ఆరోపణలు మాత్రమేనని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ కరువు తీసుకొచ్చిందంటూ తమ ప్రభుత్వాన్ని కొందరు బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రాజెక్టుల్లో నీటిని వృథాగా వదిలి కృత్రిమ కరువు సృష్టించారని ఆరోపించారు. శ్రీశైలం, నాగర్జునసాగర్ ప్రాజెక్టుల్లోని నీటిని జాగ్రత్తగా భద్రపరుచుకొని వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరించి ఎన్నికల్లో ఓట్లు పొందడానికి కాలువల వెంట నీళ్లు పారించి వృథాగా సముద్రంలోకి వదిలారని మండిపడ్డారు. మేడిగడ్డ కుంగడం వల్లే గత పాలకులు నీటిని దిగువకు వదిలారని ఆరోపించారు. నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్లే ఇప్పుడు నీటి కొరత ఎదురైందని విమర్శించారు. వారు చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని, అధికారులతో నిత్యం సమీక్షిస్తూ రూ. 100 కోట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో తాగునీటి కొరత రానివ్వబోమన్న భట్టి.. గత ప్రభుత్వం రూ. 43 వేల కోట్లతో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పథకం ప్రయోజనం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
కేంద్రమంతి కిషన్రెడ్డిని ఉద్దేశించి గడిచిన పదేండ్లలో రాష్ర్టానికి రూ. 10 లక్షల కోట్లు ఇచ్చామని ఓ కేంద్రమంత్రి చెప్పడం అబద్ధమని భట్టి పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చింది రూ. 3,70,235 కోట్లు మాత్రమేనని తెలిపారు. పన్నుల నుంచి రాష్ర్టానికి వాటాగా రావాల్సిన వాటా కూడా చెల్లించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం రూ. 10 లక్షలు ఇచ్చింది నిజమే అయితే గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకం కింద తమ ప్రభుత్వం 65 లక్షల మంది రైతులకు రూ.5,575 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. మిగిలిన 5 లక్షలమంది రైతుల ఖాతాల్లోనూ డబ్బులు వేస్తున్నట్టు చెప్పారు. నాలుగు నెలల్లోనే 93 శాతం మంది రైతులకు భరోసా డబ్బులు చెల్లించినట్టు వివరించారు. గత ప్రభుత్వం చెల్లించని రైతు బీమా ప్రీమియం రూ. 734 కోట్లను కూడా తామే చెల్లించినట్టు పేర్కొన్నారు.
విద్యుత్తు రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా గత ప్రభుత్వం ఎలాంటి కృషి చేయలేని భట్టి విమర్శించారు. ఒక్కో యూనిట్ను రూ. 20 చొప్పున కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మాత్రం పీక్ అవర్స్లో పవర్ ఎక్స్చేంజ్ నుంచి యూనిట్ను రూ. 10 చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. విభజనచట్టంలో ఎన్టీపీసీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్తును కేటాయించినప్పటికీ పదేండ్లు అధికారంలో ఉండి దానిని విస్మరించారని మండిపడ్డారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ప్లాంట్లను ప్రారంభించి వాటిని తెలంగాణకు గుదిబండగా మార్చిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయ లబ్ధికోసం ఎన్టీపీసీ విద్యుత్తు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేండ్లు ఎలాంటి ఢోకా లేదని భట్టి విక్రమార్క ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఈ ఐదేండ్లు కృషిచేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి, యూనియన్ అధ్యక్షుడు విరాహత్ అలీ, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.