Mallu Bhatti Vikramarka | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): బహుళజాతి కంపెనీల వల్ల ఒనగూరే ప్రయోజనమేదీ లేదని, అవి ఎంఎస్ఎంఈలను, స్టార్టప్లను మింగేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బహుళజాతి కంపెనీలతో సామాజిక న్యాయం, సమానత్వం, ఉద్యోగ, ఉపాధి కల్పన అనేవి భూతద్దం పెట్టి వెదికినా కనిపించవని అన్నారు. బహుళజాతి కంపెనీల పెట్టుబడుల కోసం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు దావోస్ సదస్సులో పాల్గొని వచ్చిన తెల్లారే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బహుళజాతి సంస్థలతో అభివృద్ధి సాధ్యమన్నది గోబెల్స్ ప్రచారం మాత్రమేనని భట్టి అభిప్రాయపడ్డారు. బహుళజాతి సంస్థల ద్వారా సాధించే అభివృద్ధి కంటే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం ద్వారా ఎక్కువ అభివృద్ధి సాధించవచ్చునని స్పష్టంచేశారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని టూరిజంప్లాజాలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యాక్రమంలో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉత్పత్తి రంగంగా ఉన్న వ్యవసాయరంగం నుంచి దేశాన్ని పారిశ్రామికీకరణ వైపు నడిపించేందుకు అప్పటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపట్టిన చర్యలు, ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక విధానాల కారణంగానే నేడు దేశం పురోగమిస్తున్నదని చెప్పారు. ‘ఇంత పెద్ద సువిశాల దేశంలో, అనేక వ్యత్యాసాలు ఉన్న మన సమాజంలో ఉత్పత్తి రంగాలన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలనే ఉద్దేశంతోనే ఆనాడు ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేశారని వివరించారు.
మిశ్రమ ఆర్థిక విధానం ద్వారానే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందనే ఆలోచనతో వీటిని ఏర్పాటుచేశారని చెప్పారు. ఆ పునాదులు, ప్రణాళికలే నేడు మనందరినీ ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాల వల్ల బహుళజాతి కంపెనీలొచ్చి దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను, అనేక స్టార్టప్ కంపెనీలను మింగేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
అందరికీ పంపిణీ కావాల్సిన సంపద ఏ కొద్దిమందికో చెందుతున్నదని, ఈ పరిణామం మానవ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నదని చెప్పారు. రేవంత్ పర్యటన వల్ల అంతర్జాతీయ కంపెనీల నుంచి వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఉపముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.
ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తాం
దేశ సంపద అందరికీ పంపిణీ కావాలంటే ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే మార్గమని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం, అందరి అభివృద్ధి వీటిద్వారానే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు దేశానికి, రాష్ర్టాలకు ఒక ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పారిశ్రామిక క్లస్టర్లను పెంచడం, యువతను ప్రోత్సహించడం, ఆర్థిక సహాయం, విజ్ఞానం అందజేయడం ద్వారా వారిని మంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు. తద్వారా జీడీపీని పెంచుకునేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో పారిశ్రామిక క్లస్టర్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మంచి ప్రోత్సాహాకాలు ఇస్తామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం సంధానకర్తగా ఉండి ఎంఎస్ఎంఈలకు కావాల్సిన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలవారిని కలుపుకొనిపోతూ వనరులను సమానంగా పంచగలిగినప్పుడే, సంపద సృష్టించే రంగాల్లో అందరినీ భాగస్వాములను చేయగలిగితేనే సమసమాజ స్థాపన జరుగుతుందని పేర్కొన్నారు. ఇండస్ట్రీ రంగంలో, వర్క్ డిస్ట్రిబ్యూషన్లో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షించారు.
పరిశ్రమల స్థాపనకు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు భూకేటాయింపు అంశం ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. స్టార్టప్ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తామని స్పష్టంచేశారు. స్టార్టప్లు కూడా ఇప్పుడు వారి చేతుల్లో లేకుండా పోతున్నాయని, ఎంఎన్సీలు వాటిని కూడా తినేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంఎస్ఎంఈలు కోరుతున్నవిధంగా సబ్సిడీలు, విద్యుత్తు సబ్సిడీలతోపాటు ఇతర కోరికలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం అకడ వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన ప్రారంభించి పరిశీలించారు.