హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై టీఎస్ఆర్టీసీ దృష్టి పెట్టాలని, సంస్థ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. సచివాలయంలో బుధవారం ఆర్టీసీపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి పూర్తిస్థాయి సహాయ, సహకారాలు అందిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించారని వివరించారు. నిర్వహణ నిధులను సంస్థకు సకాలంలో సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి, త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజల సంస్థ అని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సంస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లాజిస్టిక్స్, కమర్షియల్ ఆదాయంపైనా సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతిరోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు మంత్రులకు వివరించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, టీఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, డిప్యూటీ సీఎం ఓఎస్డీ కృష్ణభాసర్, ఆర్టీసీ ఈడీలు ముని శేఖర్, కృష్ణకాంత్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.