హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): చందనవెల్లిలో చేపట్టిన భూసేకరణ సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపిస్తామని, నిజమైన లబ్ధిదారులకు పరిహారం అందేలా చూస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చందనవెల్లి పరిధిలో శుక్రవారం జున్నా సోలార్పవర్ ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన ఉపముఖ్యమంత్రిని భూ బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందనవెల్లి గ్రామ సర్వే నంబర్ 190లో చేపట్టిన భూసేకరణలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
ఎంజాయ్మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు సైతం బాధితులు తన దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఎంజాయ్మెంట్ సర్వే పేరిట రికార్డుల్లో లేని వారి పేర్లను చేర్చి భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని, దీనిపై సమగ్రవిచారణ చేయిస్తానని వెల్లడించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పరిశ్రమలు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని భట్టి హెచ్చరించారు.