పాములపర్తి వేంకట నరసింహారావు.. అనంత ఆకాశాన్ని అరచేతి అద్దంలో చూపించే ప్రయత్నం చేస్తే.. రెండక్షరాల పీవీ! రాజకీయాల్లో నారసింహం! సాహిత్యంలో సహస్రఫణి! వ్యూహరచనలో మేరునగం! స్థితప్రజ్ఞతలో హిమాలయం!తెలంగాణ నేల జగతికిచ్చిన కోహినూర్ వజ్రం.. మేలైన భారతరత్నం తరగని విజ్ఞాన ఖని.. తరతరాల జ్ఞానభూమి.. పీవీ!
తెలంగాణ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, వ్యూహరచనా దురంధరుడు, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు, తాత్విక యోగి, దక్షిణాది నుంచి తొలి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. ఆయనతోపాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్కూ కేంద్రం అత్యున్నత పురస్కారం ప్రకటించింది.
దేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన నేత, అసాధారణ ప్రజ్ఞాశీలి పీవీ. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన తెలుగుమేధ పీవీ. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు.. అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం దాకా.. దేశ తలరాతను తిరగరాశారు పీవీ. అప్పుల ఊబిలో కూరుకుపోయి బంగారం తాకట్టుపెట్టే దశ నుంచి తప్పించి, లైసెన్స్రాజ్ సంకెళ్ల నుంచి విముక్తం చేసి.. భారత గతిని, దుర్గతిని మార్చిన దార్శనికుడు. సంస్కరణలతో స్వేచ్ఛావాణిజ్యానికి ద్వారాలు తెరిచి, సంక్షోభాలను సైలెంట్గా పరిష్కరించారు. దేశాన్ని ప్రబల ఆర్థికశక్తిగా నిలిపారు. అసలు సిసలైన మేలిమి భారతరత్నం.. పీవీ! శతజయంతి ఉత్సవాలు ఇటీవలే పూర్తయిన వేళ.. మహానేత పీవీని వరించి తనను తానే గౌరవించుకున్నది భారతరత్న పురస్కారం! ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే!.. అందుకే మాతృభూమి తెలంగాణ సంతోషంతో మురిసిపోతున్నది. స్వస్థలం వంగర సగర్వంతో సంబురపడుతున్నది.
PV Narasimha Rao | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారత మాజీ ప్రధానమంతి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. 1991లో ఆర్థిక సంస్కరణలతో దేశా న్ని కొత్త ప్రగతి మార్గం పట్టించిన అపర మేధావి, దివంగత పీవీకి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం భారతరత్న ప్రకటించింది. ఆయనతోపాటు మరో మాజీ ప్రధాని, రైతు ఉద్యమ నాయకుడు చరణ్సింగ్కు, భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రధాని మోదీ స్వ యంగా ఈ ప్రకటన చేశారు. కొద్దిరోజుల క్రితమే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్తోపాటు, బీజేపీ నేత ఎల్కే అద్వానీకి కూడా భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒకే ఏడాదిలో ఐదుమంది ప్రముఖులకు భారతరత్న ప్రకటించినట్టయ్యింది. ఆ అవార్డు చరిత్రలో ఒకేసారి ఇంతమందికి పురస్కారం అందించటం ఇదే మొదటిసారి. కేంద్రం ప్రకటనపై అధికార ప్రతిపక్షాలతోపాటు సామాన్యుల నుంచి కూడా హర్షాతిరేకాలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
భారతరత్న పురస్కారం ప్రకటన సందర్భంగా పీవీ నరసింహారావును ప్రధాని నరేంద్రమోదీ ‘రావుగారు’ అని సంబోధించారు. దేశానికి పీవీ చేసిన సేవలను శ్లాఘించారు. ‘పీవీ దూరదృష్టిగల నాయకత్వం దేశం ఆర్థికంగా ముందడుగు వే యటానికి ఎంతో తోడ్పడింది. దేశ ఆర్థిక శ్రేయస్సు, వృద్ధికి బలమైన పునాదులు వేసింది. రావుగారి పాలనాకాలంలోనే ప్రపంచమార్కెట్కు భారత్ తలుపులు తెరిచింది. దేశ ఆర్థికరంగంలో కొత్త శకం మొదలైంది. ప్రధానిగా విదేశీ విధానం, భాష, విద్య తదితర రంగాల్లో చేపట్టిన మార్పులు ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు తార్కాణాలు. దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయటంతోపాటు భారతీయ సంస్కృతి, మేధోసంపత్తిని సుసంపన్నం చేశారు’ అని మోదీ కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్సింగ్కు భారతరత్న ప్రకటించటం తమ ప్రభుత్వ అదృష్టమని పేర్కొన్నారు.ఎమ్మెల్యేగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా, ప్రధానిగా దేశ నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారని కొనియాడారు. శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ దేశానికి చేసిన సేవలను మోదీ గుర్తుచేశారు. ‘భారత్ వ్యవసాయరంగంలో స్వయంసమృద్ధి సాధించటంలో స్వామినాథన్ అసాధారణ పాత్ర పోషించారు. ఆవిష్కర్తగా, విద్యార్థులకు మెంటార్గా వెలకట్టలేని పాత్ర పోషించారని శ్లాఘించారు. ఆయన పరిశోధనలు వ్యవసాయరంగంలో సమూల మార్పులు తేవటంతోపాటు దేశానికి ఆహార భద్రతను అందించాయని పేర్కొన్నారు.
పీవీ నరసింహారావు బహుభాషావేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, పరిశోధకుడిగా దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుతెచ్చుకొన్నారు. 1991 నుంచి 1996 వరకు ఐదేండ్లు పూర్తికాలం ప్రధానిగా పనిచేసిన పీవీ.. దేశానికి ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసి, ఆధునికతవైపు పరుగులు పెట్టించారు. వీ ఆర్థిక సంస్కరణలతోనే భారత్ నేడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలబడింది. పీవీ అధికారం చేపట్టేనాటికి దేశం ఎంతటి దుర్బర పరిస్థితుల్లో ఉన్నదంటే.. కనీసం అప్పులకు వడ్డీలు చెల్లించలేక చెల్లింపుల సంక్షోభం అంచుకు చేరింది. ఆ సమయంలో ఎంతో ధైర్యంగా అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్సింగ్తో కలిసి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పారిశ్రామిక, సేవల రంగాలకు ప్రతిబంధకంగా మారిన రెడ్టేపిజాన్ని (అనుమతుల్లో అనవసర జాప్యం) తుడిచిపెట్టేశారు. దీంతో దేశంలోకి పెట్టుబడులు గట్టుతెంపుకొన్న నీటి ప్రవాహంలా వచ్చిపడ్డా రు. దేశీయ పెట్టుబడిదారులు కూడా ఇబ్బడిముబ్బడిగా కంపెనీలను స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ఉండీ ఏనాడో స్వాతం త్య్రం వచ్చిన కొత్తలో మొదటి ప్రధాని నెహ్రూ వేసిన సోషలిజం ఆర్థిక విధానాలను ధైర్యంగా పక్కనబెట్టి, స్వేచ్ఛా వాణిజ్యానికి బాటలు వేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వంగరలో 1921 జూన్ 28న జన్మించిన పాములపర్తి వెంకట నరసింహారావు ఉస్మానియా, బాంబే, నాగపూర్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. ఓయూలో వందేమాతరం ఉద్యమంలో పాల్గొని బహిష్కరణకు గురయ్యారు. 1971 నుంచి 73 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాని కాకముందు కేంద్ర మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాలు, రక్షణ, హోంశాఖలను నిర్వహించారు. 83 ఏండ్ల వయసులో 2004 డిసెంబర్ 23న మరణించారు.
ఉత్తర భారత దేశంలో 1960, 70 దశాబ్దాల్లో పుట్టుకొచ్చిన బలమైన రైతు ఉద్యమాలకు తిరుగులేని నాయకుడిగా ఎదిగనారు మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్. కాంగ్రెస్ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన, బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మించారు. నెహ్రూ సోషలిస్టు ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి, రైతులకు భూమిపై శాశ్వత హక్కులకు పోరాటం చేశారు. మొదట కాంగ్రెస్ అభిమానిగానే ఉన్న ఆయన.. 1960 దశకంలో ఆ పార్టీ నుంచి దూరం జరిగి మొత్తం ఉత్తరాధిలో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్ జిల్లాలో ఉన్న నూర్పూర్ గ్రామంలో 1902 డిసెంబర్ 23న జాట్ సామాజికవర్గానికి చెందిన నేత్రాకౌర్, చౌదరి మీర్సింగ్ దంపతులకు చరణ్సింగ్ జన్మించారు. ఆగ్రా యూనివర్సిటీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. నాటి యునైటెడ్ ప్రావిన్స్లో చప్రౌలీ అసెంబ్లీ స్థానం నుంచి 1937లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967 ఏప్రిల్ 1న సంయుక్త విధాయక్ దళ్ అభ్యర్థిగా తొలిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం ఉత్తరభారతదేశంలోనే ఆయన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి కావటం గమనార్హం. 1970లో రెండోసారి యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినా, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చరణ్సింగ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి 1970 అక్టోబర్ 2న రాష్ట్రపతిపాలన విధించింది. భారతీయ లోక్దళ్ పార్టీని స్థాపించి 1977లో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషిచేశారు. జనతా ప్రభుత్వంలో 1979లో కేంద్ర ఆర్థికమంత్రిగా, ఆ తర్వాత ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. జనతాపార్టీ ముక్కలైన తర్వాత తాను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే 1979 జూలై 28న రెండో కాంగ్రెసేతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ పదవిలో ఎక్కువకాలం ఉండలేకపోయారు. అదే ఏడాది ఆగస్టు 20న ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆపద్ధర్మ ప్రధానిగా 1979 ఆగస్టు 21 నుంచి 1980 జనవరి 14 వరకు కొనసాగారు. 84 ఏండ్ల వయసులో 1987 మే 29న ఆయన తుదిశ్వాస విడిచారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాతా దేశ ప్రజల ఆకలిబాధ తీరలేదు. నిత్యం విదేశాల నుంచి ఆహారధాన్యాలు దిగుమతి చేసుకొనేవారు. వ్యవసాయ రంగంలో కాలానుగుణంగా మార్పులు రాక అతి తక్కువ పంటలతో రైతులు నిత్యం ఆకలితోనే ఉండేవారు. ఆ సమయంలో ఎంఎస్ స్వామినాథ్ కొత్త వంగడాలను సృష్టించారు. ఆయన కృషితో అనతికాలంలోనే ఆహారధాన్యాల విషయంలో దేశం స్వయంసమృద్ధి సాధించింది. తమిళనాడు కుంభకోణంలో 1925 ఆగ స్టు 7న స్వామినాథన్ జన్మించారు. 1949లో నెదర్లాండ్స్లోని వాగెనింజెన్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో తొలిసారి ఆలుగడ్డలపై సైటోజెనెసిస్ పరిశోధనలు మొదలుపెట్టారు. 1952లో జెనెటిక్స్లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. ఆ పరిశోధనల ఫలితంగా ఆయనకు కటక్లోని సెంట్రల్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇండికా జపానికా రకం వరి వంగడంలో హైబ్రిడ్ను సృష్టించే పరిశోధన చేసేందుకు అవకాశం లభించింది. ఆ పరిశోధనే దేశంలో హరితవిప్లవానికి నాంది పలికింది. 1988లో రిసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించి ఎంతోమంది పరిశోధకులకు మెం టార్గా పనిచేశారు. వ్యవసాయ పరిశోధనలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 1987లో మొట్టమొదట స్వామినాథన్నే వరించింది. జీవితకాలంలో అనేక కీలక పదవులు అలంకరించిన ఆయన 2023 సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచారు.
మాజీ ప్రధాని పీవీ కి భారతరత్న ప్రకటించడంపై ఆయన స్వగ్రామం వంగరలో సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. పీవీ ఇంటిని కుటుంబసభ్యులు మ్యూజియంగా మార్చి ప్రధానిగా ఉన్న సమయంలో పీవీ వినియోగించిన వస్తువులు, ఫొటోలను ప్రత్యేక గ్యాలరీగా ఏర్పాటు చేశారు. పీవీ వినియోగించిన కారు ఇంటి ఆవరణలో ప్రదర్శనకు ఉంచారు. ఆయన ఇంటి ఎదుట కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. ఏటా పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కుటుంబసభ్యులు ఇక్కడే నిర్వహిస్తారు.
మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుజీని భారత రత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా ఆయన భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృత సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక సంవత్సరాల పాటు పార్లమెంట్, శాసనసభ్యుడిగా చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుంది. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటంలో పీవీజీ దూరదృష్టితో కూడిన నాయకత్వం కీలక పాత్ర పోషించింది. దేశ శ్రేయస్సు, అభివృద్ధికి అది బలమైన పునాది వేసింది. భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేస్తూ ఆర్థికాభివృద్ధిలో కొత్త శకాన్ని ప్రోత్సహించిన ప్రధానిగా రావుగారి పదవీకాలం గుర్తుండిపోతుంది. అత్యంత క్లిష్టమైన మార్పుల నేపథ్యంలో భారతదేశ విదేశాంగ విధానం, భాష, విద్యా రంగాలకు ఆయన అందించిన సహకారం మరువలేనిది. సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన అసలైన నాయకుడు పీవీ నరసింహారావు.
– ఎక్స్ వేదికగా సందేశంలో ప్రధాని మోదీ
తెలంగాణ బిడ్డ, తెలుగు ప్రజల గౌరవం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించడం హర్షనీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పీవీ నరసింహరావుకు భారతరత్న రావడం యావత్తు తెలంగాణ గర్వించదగ్గ విషయమని మంత్రి హరీశ్రావు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించడంపై మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, సుంకె రవిశంకర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్,పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు.
కొంచెం ఆలస్యమైనా తన తండ్రి పీవీ నరసింహారావుకు భారతరత్నతో గొప్ప గౌరవం దక్కిందని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి హర్షం వ్యక్తంచేశారు. మాజీ ప్రధాని, తెలుగుతేజం పీవీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం హర్షనీయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. పీవీకి భారతరత్న రావడం తెలంగాణతోపాటు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. ఇప్పటికీ ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలే దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు. గొప్ప వ్యక్తులకు సన్మానం మన సంస్కారమని తెలిపారు.
పీవీకి భారతరత్న ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గర్వకారణమని మాజీ ప్రధాని నరసింహారావు తనయుడు పీవీ ప్రభాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. పీవీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల తరఫున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారం ఆరు దశాబ్ధాలుగా అచంచలమైన అంకితభావంతో దేశానికి ఆయన చేసిన అసమానమైన సేవలకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. పీవీ గొప్ప పండితుడే కాకుండా బహుభాషా కోవిదుడని, మంచి దౌత్యవేత్త అని తెలిపారు. ఆయన చురుకైన నాయకత్వం, దార్శనిక విధానాలు భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేశాయని, మన దేశ ప్రగతిపథాన్ని రూపొందించాయని చెప్పారు. భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తికి ఈ గౌరవాన్ని అందించడంలో చొరవ చూపిన ప్రధాని నరేంద్రమోదీకి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ప్రభాకర్రావు తెలిపారు. పీవీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరును భారతరత్నకు సిఫారసు చేయాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడంలో కీలకపాత్ర పోషించినందుకుగాను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పీవీ దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి గణనీయంగా సేవలందించేందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందని అన్నారు.
పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో మన దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. మైనార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పీవీ నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక ప్రగతిని గాడిన పెట్టారు. ప్రాంతాన్ని కాకుండా దేశాన్ని ఒక కుటుంబంగా చూసిన మహనీయుడు. పీవీకి భారతరత్న ప్రకటించిన ప్రధాని మోదీకి అభినందనలు.
-మదన్మోహన్రావు,పీవీ సోదరుడి కుమారుడు
పీవీ ఇంటి వెనుకాల ఎడ్లపాక ఉండేది. ఆవులు, ఎద్దులు నేనే చూసుకునేటోడిని. వాటికి పచ్చగడ్డి తీసుకచ్చి వేసేది. పీవీ ఎప్పుడూ మమ్మల్ని పనోళ్ల లెక్క సూడలేదు. ఓ భూమ అంత మంచిదేనా? ఎట్లున్నవ్ అని అడిగేవారు. మా పీవీ సాబ్ ఇప్పటికీ నా కండ్లళ్ల మెదులుతున్నరు.
-దాడి భూమయ్య, వంగర (పీవీ స్వగ్రామం)