అయిజ, ఫిబ్రవరి 26: కూత వేటు దూరంలోనే తుంగభద్ర నది. మిషన్ భగీరథ పథకం కింద మూడు నెలల క్రితం వరకు పుష్కలంగా నీటి సరఫరా. అంతలోనే పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. వర్షాలు ఆశించినమేర లేకపోవడం, ఫిబ్రవరి నుంచే భానుడు భగభగలాడుతుండడంతో నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ వస్తున్నది.
ఫలితంగా వేసవికి ముందే జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని రాజాపురం దాహార్తితో అల్లాడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటిఇంటికీ నల్లాల ద్వారా పుష్కలంగా వచ్చే నీరు ఇప్పుడు ముఖం చాటేయడంతో గొంతు తడుపుకొనేందుకు గ్రామస్థులు పడరాని పాట్లు పడుతున్నారు.
నాలుగు ట్యాంకర్లతో నీటి సరఫరా
రాజాపురంలో 540 నివాస గృహాలు ఉండగా 2,400 మంది నివసిస్తున్నారు. ఒక్కోటీ 60 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు (1.2 లక్షల లీటర్లు) ట్యాంకులు ఉన్నాయి. నీటి సరఫరా కోసం 530 మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. గ్రామానికి సరిపడా నీటిని సరఫరా చేయాలంటే జూరాల పంప్హౌస్ నుంచి నీరు అందాలి. కానీ, కృష్ణానదిలో నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో తాగునీటికి కష్టాలు మొదలయ్యాయి. గ్రామంలో చేతి పంపులు, బోర్లు లేకపోవడంతో నీటికోసం జనం తండ్లాడుతున్నారు.
ప్రస్తుతానికి నాలుగు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామానికి సమీపంలోనే తుంగభద్ర నది పారుతున్నప్పటికీ మిషన్ భగీరథ నీటి సరఫరాను పెంచడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి ఎద్దడికి గత సర్పంచ్ నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. గ్రామంలో ప్రస్తుతం గుంటి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు బంధువులను ఆహ్వానిద్దామంటే నీటి కొరత వేధిస్తుండడంతో వెనక్కి జంకుతున్నారు.
నీటి కోసం కొట్లాట
గ్రామానికి నీటిని అందించేందుకు మూడు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోరును అధికారులు లీజుకు తీసుకున్నారు. నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ ట్యాంకర్తో పాటు సమీపంలోని పులికల్, బైనపల్లి, కొత్తపల్లి గ్రామాల ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ వచ్చిన సమయంలో నీటి కోసం జనం కొట్టుకుంటున్నారు. క్యూలో బిందెలు ఉంచి వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తుండడంతో ట్యాంకర్ల వద్ద ప్రజలు బిందెలు పట్టుకుని పరుగులు పెట్టాల్సి వస్తున్నదని, క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వస్తున్నదని గ్రామస్థులు వాపోతున్నారు.
నీళ్లే లేవు.. జాతరెట్ల చేసుకోవాలె
ఎండాకాలం రానేలేదు. నీళ్లు లేకపాయె. కేసీఆర్ సార్ ఉన్నప్పడు మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికీ నల్లాల ద్వారా ఇచ్చెటోడు. ఇప్పడేమో మా ఊరికి తాగనికె నీళ్లొస్తలేవు. బోర్లు లేవు. చేతి పంపులు లేవు. నీళ్లెట్ల తెచ్చుకోవాలె. ట్యాంకర్లు లేకపోతే సేన్లకెళ్లి తెచ్చుకోవాలె. సేన్ల రైతులు రానీయకపోతే ఎట్ల? నీళ్లు లేక జాతరకు చుట్టాలను పిలువకపోతిమి. సర్కారు దయదల్చి మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లు ఇయ్యాలె.
-హనుమంతమ్మ, రాజాపురం, అయిజ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా
తుంగభద్ర ఉన్నా నీళ్లు లేకపాయె
తుంగభద్ర నది పక్కనే ఉన్నా నీళ్లు లేకపాయె. మిషన్ భగరీథ నల్లాలు ఉన్నా నీళ్లు రాక ఒట్టిపోయాయి. పనులకు పోకుండా ట్యాంకర్ల నీళ్ల కోసం గంటల తరబడి చూడాల్సి వస్తున్నది. పనులకు వెళ్లకుండా నీళ్లకే పొద్దంతా పోతుంది. మా ఊరికి తాగేందుకు నీళ్లిచ్చి కష్టాలు తొలగించాలి.
– పద్మమ్మ, రాజాపురం, అయిజ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా
శాశ్వత పరిష్కారానికి చర్యలు
రాజాపురానికి మిషన్ భగీరథ నీరు అంతంత మాత్రం వస్తున్న విషయం అధికారులతో చర్చించాను. 1.2 లక్షల లీటర్లు రావాల్సి ఉండగా 40 వేల లీటర్ల వరకు అందుతున్నాయి. తక్కువ సమయంలోనే ట్యాంక్లు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. ఉన్నతాధికారులతో చర్చించి, అదనంగా మిషన్ భగీరథ పైప్లైన్ వేయించి తాగునీటి ఎద్దడి తీర్చేందుకు చర్యలు తీసుకుంటాం.
– వెంకటయ్య, ఎంపీడీవో, అయిజ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా