కరీంనగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణప్రతినిధి)/ధర్మపురి: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. ఆయన వ్యవహారశైలిపై పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్నిస్థాయిల నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే వివేక్కు వ్యతిరేకంగా పలువురు గళం విప్పగా.. తాజాగా శనివారం ఆ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య తిరుగుబాటుతో తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ విషయంలో అంజయ్యకు మెజార్టీ నాయకులు మద్దతు ఇస్తుండగా, వివేక్ తీరుపై ఇక తాడోపేడో తెల్చుకోవడానికి పలువురు నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
దళిత నేతపై వివేక్ దురుసు ప్రవర్తన
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వర్చువల్ సమావేశాల సందర్భంగా శనివారం ధర్మపురి నియోజకవర్గంలోని ఎస్సారార్ గార్డెన్స్లో నియోజకవర్గస్థాయి బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర నాయకులు మాట్లాడారు. ఆ తర్వాత స్థానిక నాయకులు మాట్లాడుతుండగా నియోజకవర్గ మాజీ కన్వీనర్ రాంబాబు లేచి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జియే కాకుండా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన కన్నం అంజయ్యను స్టేజీ పైకి ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని ప్రశ్నించారు. తనను ఎందుకు వేదికపైకి పిలువలేదంటూ అంజయ్య కూడా వివేక్ను ప్రశ్నించారు. గొడవకు దిగేవారిని స్టేజీలపైకి పిలిచే ప్రసక్తే లేదని, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో.. అంటూ వివేక్ దురుసుగా మాట్లాడడంతో బీజేపీ నాయకులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. వివేక్ దురుసు సమాధానంతో మనోవేదనకు గురైన కన్నం అంజయ్య తన అనుచరులతో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
భగ్గుమంటున్న నేతలు
గడ్డం వివేక్ ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీలోని సీనియర్లను, పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వారిని పక్కపెట్టడం ఆయనకు రివాజే అన్న విమర్శలున్నాయి. గతంలో కాంగ్రెస్లో, ఆ తర్వాత బీఆర్ఎస్లో ఇదే పంథాను అనుసరించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బీజేపీలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారని విమర్శలొచ్చాయి. పార్టీలో ఆది నుంచీ పనిచేస్తున్న నాయకులను కాదని, తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వివేక్ చేస్తున్న ప్రయత్నాలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. గతంలో నియోజకవర్గ ఇన్చార్జ్జులు మంచిర్యాలలో వివేక్కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. రామగుండంలో జరిగిన ప్రధాని సభలో వివేక్ పక్షపాతం చూపారని బీజేపీ పెద్దపల్లి అసెంబ్లీ నియోజవర్గ ఇన్చార్జి గుజ్జుల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివేక్కు వ్యతిరేకంగా కదిలేందుకు ఆ పార్టీ నేతలు సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తున్నది.
వివేక్ బీజేపీని భ్రష్టుపట్టిస్తున్నారు
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ.. పార్టీని భ్రష్టు పట్ట్టిస్తున్నారు. 20 ఏండ్లుగా బీజేపీలో నేను క్రియాశీలకంగా పనిచేస్తున్నా. శనివారం జరిగిన బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో స్టేజీ మీదకు నన్ను ఆహ్వానించకుండా అవమానించారు. పార్టీలోకి పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఏండ్లుగా పనిచేస్తున్న నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
– కన్నం అంజయ్య, బీజేపీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి