భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 27 (నమస్తే తెలంగాణ): భద్రగిరి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నది. పావన గౌతమీ తీరంలో కొలువై ఉన్న సీతారాముల కల్యాణానికి ముహూర్తం సమీపించింది. ఈ నెల 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం క్రతువులను జరిపించేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ సారి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్నందున లడ్డూలు, తలంబ్రాలను భారీస్థాయిలో సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ అధికారులందరికీ ఇప్పటికే విధులను ఖరారు చేశారు. మంగళవారం నుంచి వారు విధుల్లో చేరనున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఈ దివ్యక్షేత్రంలో 1999, 2011లో పుష్కర పట్టాభిషేకం నిర్వహించగా ఈ సారి మార్చి 31న జరుగనున్నది.