హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సమాజాన్ని కుల, మతాలవారీగా చీల్చి ప్రజల మధ్య ఉద్రిక్తలు, వైషమ్యాలు రెచ్చగొట్టే దౌర్భాగ్యపు రాజకీయాలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చేతగానివాళ్లు మాత్రమే భావోద్వేగాలను రెచ్చగొడుతూ చిల్లరమల్లర రాజకీయాలు చేస్తారని విమర్శించారు. తెలంగాణభవన్లో మంగళవారం కేటీఆర్ సమక్షంలో కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనేరు సత్యనారాయణ (చిన్ని) బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ దేశానికి చేసింది ఏమీలేదని, చెప్పుకోవడానికి ఏమీ లేక డైవర్షన్ పాలిటిక్స్తో గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే.. బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెట్టేవిధంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. సింగరేణికి ప్రధాని మోదీనే శత్రువు అని, సింగరేణిని ముంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు తొమ్మిదేండ్లుగా అన్యాయమే చేసిందని, ఫాసిస్టు ధోరణిలో ఏకపక్షం గా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ప్రజ లు కూడా మోదీ భ్రమల నుంచి బయటపడుతున్నారని చెప్పారు. అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి న బీజేపీ మాట తప్పిందని, కానీ సీఎం కేసీఆర్ ఎన్నికల హామీ ఇవ్వకుండానే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు రైతుబంధు ద్వారా జమ చేశారని చెప్పారు.
రజాకార్ సినిమా అభ్యంతరకరం
బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి ‘రజాకార్’ సినిమా తీశారని, ఇందులో చంపుకోవడాలు చూపించి, పాత గాయాలను మళ్లీ రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కశ్మీర్ఫైల్స్, కేరళఫైల్స్ పేరుతో ప్రజలను రెచ్చగొడుతుంటారని ఆరోపించారు.
బడ్జెట్ను మించిన కాంగ్రెస్ హామీల విలువ
ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్న కాంగ్రెస్.. 55 ఏండ్లు, 11 చాన్స్లు ఇస్తే ఏమి చేసిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘కరెంటు ఇవ్వలేదు. తాగునీరు, సాగునీరు ఇవ్వలేదు. రైతుబంధు ఇవ్వలేదు, ఏదీ ఇవ్వలేదు. సిగ్గు లేకుండా ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్నారు. వారికి అధికారం కావాలనే లక్ష్యం తప్ప మరేమీ లేదు. నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు. ఎంత వస్తే అంత చెప్తున్నారు’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల విలువ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉన్నదని తనకు ఒక స్నేహితుడు సమాచారం ఇచ్చాడని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు పింఛన్ రూ.200 ఇచ్చినోళ్లు, ఇప్పుడు మాత్రం రూ.4,000 ఇస్తామని చెప్తున్నారని విమర్శించారు. ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్కు ఓటు వేస్తే.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని అవి, కటిక చీకట్లు, కరెంటు కష్టాలు గ్యారెంటీ, తాగునీటి కష్టాలు, ఆడవారికి నీటి తిప్పులు గ్యారెంటీ, ఎరువులు, విత్తనాల కొరత గ్యారెంటీ, పోలీస్స్టేషన్ల ముందు నిలబడటం గ్యారెంటీ, రైతుబంధు, దళితబంధు బందు పెడుతారనేది గ్యారెంటీ, ఏడాదికి ఒకరు చొప్పున ఐదుగురు సీఎంలు గ్యారెంటీ, రాష్ట్రం సంకనాకి పోవడం గ్యారెంటీ’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హామీ ల్లో అభివృద్ధి గురించి ఎక్కడైనా మాట్లాడారా? అని నిలదీశారు. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు రూ.11 వేల కోట్లు దారి మళ్లించారని, హామీల అమలు చేతకాక, అభివృద్ధి పనులు చేయలేక చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. అక్కడ విద్యుత్తు సంక్షోభం నెలకొన్నదని విమర్శించారు.
నాడు గోదావరి జలాలు ఎందుకు తేలేదు?
ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పూర్తి చేస్తారని, తాగునీరు, 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రైతుబంధు లాంటి పథకాలు అందించే సీఎం కేసీఆర్ పక్షాన ఉంటారో, రాబందు లాంటి కాంగ్రెస్ పక్షాన ఉంటారో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా విజయం సాధించడం ఖాయమని, ఖమ్మం జిల్లాలోనూ బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాలో పార్టీని వీడిన కొందరు నేతలు.. స్వీయ మానసిక ఆందోళనను ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆనాడు గోదావరి జలాలను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. కోనేరు చిన్ని సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్లో చేరినట్టు చెప్పారు. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, బీఆర్ఎస్ నాయకులు మదన్లాల్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీకి ఎదురుదెబ్బ
కోనేరు చిన్ని బీఆర్ఎస్లో చేరడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగూడెం నియోజకవర్గంతోపాటు జిల్లావ్యాప్తంగా బలమైన సామాజికవర్గం, క్యాడర్ కలిగిన కోనేరు చిన్ని చేరికతో బీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. మంగళవారం కొత్తగూడెం నుంచి 300 కార్లతో సుమారు మూడువేల మంది కార్యకర్తలు, కోనేరు అభిమానులు హైదరాబాద్కు తరలివచ్చి బీఆర్ఎస్లో చేరారు.
కిషన్రెడ్డీ.. మోదీ ఇంటి దగ్గర ధర్నా చేయి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సిగ్గు, శరం, లజ్జ, తెలంగాణ పౌరుషం, చీము, నెత్తురు ఉంటే నిరుద్యోగ సమస్యపై ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవే ఊడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్ పెట్రోల్ ధరను రూ.100 దాటించి, గ్యాస్ ధరను రూ.1,200 చేసిన ఘనత ప్రధాని మోదీదేనని ఎద్దేవా చేశారు. పతనమవుతున్న రూపాయి విలువ, మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడని ప్రధాని మోదీ.. మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయాలని పిలుపు నిచ్చారు.