Bhadrachalam | భద్రాచలం: భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు ఆదివారం ఐదో రోజు వామనావతారంలో భక్తులకు అనుగ్రహించనున్నారు. దేవతల సర్వ సంపతలను తన స్వాధీనం చేసుకున్న బలి చక్రవర్తి దగ్గరికి శ్రీమన్నారాయణుడు వామన రూపంలో వెళ్లి మూడు అడుగుల నేలను దానంగా సవ్కరవించి ఒక డుగుతో ఆకాశాన్ని, రెండో అడుగుతో భూమిని ఆక్రమించి, మూడో అడుగును ఎక్కడ మోపాలని బలి చక్రవర్తిని అడగడంతో వచ్చిన వాడు శ్రీమన్నారాయణుడని గ్రహించి తన శిరస్సుపై మోపమని తెలపడంతో మూడో అడుగుతో బలిని పాతాళానికి అదిమేస్తాడు. ఈ అవతారాన్ని దర్శించడం వల్ల గురు గ్రహ బాధలు తొలుగుతాయని ప్రాశస్తి.
నారసింహ అవతారంలో రామయ్య దర్శనం
శనివారం నాటికి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరడంతో దశావతారాల్లో నాలుగో అవతారమైన నారసింహ అవతారంలో రామయ్య దర్శనమిచ్చారు. అర్చకులు స్వామిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారసింహావతారంలో ఉన్న రామయ్యను దర్శించుకొని భక్తులు తన్మయత్వం చెందారు. అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుండడంతో వారు పరవశించిపోతున్నారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్య పూజలు, నిత్య బలిహరణం, నిత్య హోమాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఆ తరువాత నిత్యకల్యాణ మూర్తులను, ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొని వచ్చి అభిషేక తిరుమంజనం జరిపారు. ఆండాల్ అమ్మవారిని, కణ్ణన్ స్వామివారిని, పన్నిద్రాళ్వార్లను స్వామివారి చుట్టూ ఉంచి చేసి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహావాచన జరపగా ఆచార్య, బ్రహ్మ, రుత్విక్లు నాళాయిర దివ్యప్రబంధంలోని 200 పాశురాలను ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి నేతృత్వంలో గంటపాటు పఠించారు. ఆ తరువాత స్వామివారిని నారసింహావతారంలో అలంకరించి బేడా మండపానికి తీసుకొని వచ్చి పూజలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు వరాహావతారంలో ఉన్న స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి చేసి గోదావరి తీరానికి తీసుకెళ్లి హారతులు సమర్పించి కోలాట నృత్యాలు, వేద ఘోషల నడుమ మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. నారసింహవతారంలో దర్శనమిస్తున్న తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ముగ్ధమనోహారుడైన స్వామివారిని కనులారా దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తరువాత స్వామివారికి తాతగుడి సెంటర్ వరకూ తిరువీధి సేవ జరిపారు. దేవస్థానం ఈవో రమాదేవి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, దేవస్థానం ఈఈ రవీందర్ రాజు, ఏఈవో భవానీ రామకృష్ణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పర్ణశాలలో..
పర్ణశాల: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల దేవాలయంలోనూ ముక్కోటి ఉత్సవాల సందర్భంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో నాలుగో రోజు శనివారం పర్ణశాల రామయ్య నరసింహా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శేషకిరణ్ కుమారాచార్యులు, అమరవాది శ్రీకాంత్ చార్యులు, భరద్వాజ్ చార్యులు, రాజగోపాలాచార్యులు, నరసింహా చార్యులు, ఏఈవో శ్రావణ్కుమార్, అనీల్, గుమస్తా ప్రసాద్, సిబ్బంది రాము, శివ పాల్గొన్నారు.
వెలుగులీనుతున్న రామాలయం
భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న తెప్పోత్సవం, 23న ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రామాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల కాంతులతో భద్రాద్రి రామాలయం వెలుగులీనుతోంది. రామాలయం, గాలి గోపురం, పరిసర ప్రాంతాల్లో దీపకాంతులు విరజిమ్ముతున్నాయి. భద్రాద్రి పట్టణం కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతోంది.