Ayodhya Ram Mandir | కోట్లాది మంది భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహత్తర ఘట్టం కొద్దిరోజుల్లోనే సాక్షాత్కారం కాబోతున్నది. జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? అంటూ జనాలకు ఆశచూపుతున్నారు. మాయమాటలు చెప్పి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు.
జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? అయితే ఈ లింక్ను క్లిక్ చేయండి. అంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నారు. మరికొందరైతే ఏపీకే ఫైల్ పంపించి.. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్గా వీఐపీ యాక్సెస్ దొరుకుతుంది అంటూ వాట్సాప్ల్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేసినా.. ఏపీకే ఫైల్స్ను ఇన్స్టాల్ చేసుకున్నా మొదటికే మోసం వస్తుంది. దీనివల్ల మీ పర్సనల్, బ్యాంక్ డేటా మొత్తం స్కామర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అయోధ్య రామ మందిరం పేరుతో జరుగుతున్న ఈ మోసాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా జనాలను అప్రమత్తం చేశారు. ఇలాంటి మెసేజ్ల్లో వచ్చిన లింక్లు ఓపెన్ చేయవద్దని.. ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దని సూచించారు. అలా చేస్తే మీ డేటాను సైబర్ నేరగాళ్లు దోచుకుని మోసాలకు పాల్పడతారని హెచ్చరించారు.