హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లకు గొప్ప అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. సోమవారం జాతీయ సైన్స్ డే సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్తో వినోద్కుమార్ మాట్లాడారు.
బీఎస్, ఎంఎస్ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్ విద్యార్థులను సమాయత్తం చేయాలని సూచించారు. ఐసర్ అటానమస్ విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బెర్హంపూర్, భోపాల్, కోల్కతా, మొహాలీ, పూణే, తిరువనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో ‘ఐసర్’ సంస్థలు ఉన్నాయని చెప్పారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారని, ఈ దృక్పథం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఐఐటీ, ఏఐఐఎంఎస్ స్థాయిల్ ఐసర్ విద్యా సంస్థను కేంద్రం స్థాపించిందని తెలిపారు. విదేశాల్లో చదివే పోస్ట్గ్రాడ్యుయేషన్ ఎంఎస్ తరహాలో ఐసర్ ద్వారా బీఎస్, ఎంఎస్ కోర్సులు మంచి ప్రాధాన్యం ఉందని, సైన్స్రంగంలో ఆయా కోర్సులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలుంటాయన్నారు. సైన్స్ కోర్సులకు ఎప్పటికీ ప్రాధాన్యం ఉంటుందని, బొటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో విద్యార్థులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.