నల్లగొండ : సీనియర్ నేతగా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Venkat Reddy) కి రాజకీయ పరిణితి లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy) మండిపడ్డారు. ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకుంటే బెటర్ అని సూచించారు. నల్లగొండలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ అసహనంతో కోమటిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అధికార బలంతో కాంట్రాక్టర్లు పొందారంటూ కోమటిరెడ్డి చేస్తున్న అబద్ధపు ఆరోపణలను ఖండించారు. ‘ తన వియ్యంకుడు మొదటి నుంచి కాంట్రాక్టర్. నిజాం కాలం నుంచి వాళ్లు కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. టెండర్లు వేస్తేనే గందమల్ల రిజర్వాయర్ కాంట్రాక్టు లభించిందన్న విషయాన్ని కోమటిరెడ్డి గుర్తించాలని’ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుచూ తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని, గాలి మాటలతో ప్రజలను ఎంత కాలం మోసం చేస్తారని నిలదీశారు.
పీసీసీ చీఫ్ ఒక మాట చెబితే వాటికి విరుద్ధంగా సీనియర్లు తలో వ్యాఖ్యలు చేస్తారు. కాంగ్రెస్ నేతల్లోనే ఐక్యత లేదు. వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు. వీరా ప్రజల బాగోగుల గురించి మాట్లాడేది ? అంటూ విమర్శించారు. ప్రజా ప్రతినిధులు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటే ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా ఫలితం ఉండదని అన్నారు.
ఏ హోదా ప్రజాప్రతినిధులైన సహనం, సమయమనంతో పని చేయాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉన్నా తన పూర్తి సహకారం ఉంటుందని వెల్లడించారు. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, రుణమాఫీ ప్రక్రియ ఎన్నికల నోటిఫికేషన్ లోపే పూర్తవుతుందని తెలిపారు.