హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, హైదరాబాద్లో ఈ పరిశ్రమ గట్టిగానే నిలబడింది. క్రెడాయ్ జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయా లు వెల్లడయ్యాయి. దేశంలోని 5 జోన్లలో మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన సర్వేలో 13,000 రియల్ ఎస్టేట్ డెవలపర్స్ పాల్గొన్నారు. ఇందులో 4,813 మంది అభిప్రాయాలు తెలిపారు.రెండోవేవ్ సమయంలో భవన నిర్మాణ రంగంలో కూలీల లభ్యతపై ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రశ్నించగా హైదరాబాద్లోని డెవలపర్స్ 83 శాతం మంది ఇబ్బంది కలిగిందని చెప్పగా, మిగతా మెట్రో నగరాల్లో 91 శాతం నుంచి 100 శాతం సమస్య ఎదురైందని తెలిపారు. హైదరాబాద్లో లాక్డౌన్ విధించినా భవన నిర్మాణ రంగంలో పనులు కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతించడంతో పెద్దగా సమస్యలు ఎదురుకాలేదని వెల్లడించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి మేలుచేసేలా నిర్ణయాలు తీసుకోవాలిని, రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు జీ రామిరెడ్డి కోరారు.