హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రోజురోజుకు బెంబేలెత్తిసున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త పంథాను ఎంచుకొన్నది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు అధునాతన పద్ధతులను అవలంబించేలా ప్రయత్నిస్తున్నది. మంగళవారం హైదరాబాద్ సనత్నగర్లోని బోర్డు కార్యాలయంలో పరిశ్రమ వర్గాలు, పీసీబీ సభ్యకార్యదర్శి కృష్ణ ఆదిత్య, అధికారులు సమావేశమయ్యారు. దీనికి దివీస్ ల్యాబోరేటరీస్, నాట్కోఫార్మా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ప్రతినిధులు హాజరై, కాలుష్య వెదజల్లకుండా చేపడుతున్న చర్యలను వివరించారు.
ప్రధానంగా వ్యర్థాలు ఉత్పత్తికాకుండా జాగ్రత్త పడటం, వ్యర్థాలను గణనీయంగా తగ్గించడం, జీరో లిక్విడ్ డిశ్చార్జి (జెడ్ఎల్డీ) వ్యర్థాలను శుద్ధి చేయడానికి బదులు తిరిగి పునర్వినియోగించడం సహ తాము అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను సమావేశంలో కృష్ణ ఆదిత్యకు వివరించారు. రాష్ట్రంలోని 263 ఫార్మాస్యూటికల్ పరిశ్రమలన్నీ ఈ పద్ధతులను పాటించేలా పీసీబీ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. సమావేశంలో పీసీబీ చీఫ్ ఇంజినీర్ రఘు, జేసీఈఎస్ సత్యనారాయణ, జేసీఈఈలు కృపానంద్, హన్మంతరెడ్డి ఈఈలు రాజేందర్, వెంకటనర్సు తదితరులు పాల్గొన్నారు.