B Vinod Kumar | రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు ఫలితాల సాధనలో రూపొందించే ఉత్తమ ప్రణాళికలే ప్రగతికి పునాదులు వేస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రణాళిక, అర్థగణాంక శాఖ ఉన్నతాధికారులు, సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ (CEGIS), కాకతీయ గవర్నెన్స్ ఫెలో (KGF )తో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు సమర్థవంతంగా అందే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు రాష్ట్రంలో కీలకమైన ప్రణాళిక, అర్థ గణాంక శాఖ అధికారులు, సీజిస్, కేజీఎఫ్ బృందాలు ఉత్తమ ప్రణాళికలతో పని చేయాలని, అప్పుడే ప్రగతికి గట్టి పునాదులు పడతాయని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రణాళికా శాఖపై కేసీఆర్ ప్రత్యేకదృష్టిని కేంద్రీకరించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వినోద్ కుమార్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఆర్థిక, ప్రణాళికా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్న తీరు తెన్నులను సూక్ష్మ స్థాయిలో పరిశీలించి పక్కాగా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అమెరికా కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్, ప్రణాళికా అభివృద్ధి సొసైటీ పర్యవేక్షణ అధికారి రామకృష్ణ, సలహాదారు రామభద్రం, సీజీఎస్, కేజీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.