ఫంక్షనల్ వర్టికల్ విధానంతో పోలీస్ పనితీరు మెరుగు
పౌరులకు మెరుగైన పోలీసింగ్: డీజీపీ మహేందర్ రెడ్డి
రాష్ట్ర స్థాయిలో 256 మందికి అవార్డులు ప్రదానం
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): పోలీస్శాఖలో సిబ్బందికి పని విభజన, వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచేందుకు అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ విధానంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఈ విధానం వల్ల సిబ్బంది పని సామర్థ్యం పెరగటమే కాకుండా పౌరులకు మెరుగైన పోలీసింగ్ అందించేందుకు దోహదపడుతున్నదని చెప్పారు. మొత్తం 17 ఫంక్షనల్ వర్టికల్స్ అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 256 మంది పోలీసులకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంగళవారం డీజీపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ.. ఫంక్షనల్ వర్టికల్ విధానంతో నేరస్థులకు సకాలంలో శిక్ష పడి, తక్కువ సమయంలోనే కేసుల దర్యాప్తు పూర్తవుతున్నదని తెలిపారు. రాష్ట్రంలోని అత్యంత మారుమూల పోలీస్ స్టేషన్లలోని కానిస్టేబుల్ పనితీరును కూడా అంశాల వారీగా మదింపు చేసి, ఉత్తమ సేవలు అందించే పోలీసులకు రాష్ట్ర స్థాయిలో పురసారాలు అందజేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీలు గోవింద్సింగ్, రాజీవ్ రతన్, జితేందర్, స్వాతిలక్రా, నాగిరెడ్డి, సంజయ్ జైన్, విజయ్కుమార్, ఐజీ కమలాసన్రెడ్డి, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.