Bengaluru Techie : కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలంగాణకు చెందిన యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా భర్త గదిలో ఆత్మహత్య చేసుకోగా, ఇది తెలిసిన భార్య వెంటనే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని సిద్ధిపేట ప్రాంతానికి చెందిన భానుచందర్ రెడ్డి (32), అతడి భార్య బీబీ షాజియా సిరాజ్ (31) ఇద్దరూ కలిసి బెంగళూరులోని కోతనూర్ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు.
వీరిద్దరూ వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లే. వీరి పెళ్లై తొమ్మిది సంవత్సరాలు అవుతోంది. మొదట ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్లో ఉండి, ఆ తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లైనప్పటి నుంచి వీరిద్దరి మధ్యా విబేధాలు తలెత్తాయి. దీంతో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో సోమవారం భానుచందర్ రెడ్డి తన గదిలోపల తలుపు పెట్టుకుని, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సాజియా సిరాజ్ ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో ఆమె సెక్యూరిటీతోపాటు చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. వారు వచ్చి తలుపు బద్దలుకొట్టి చూసేసరికి భానుచందర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసి దిగ్భ్రాంతికి గురైన భార్య సాజియా వెంటనే అదే అపార్ట్మెంట్ 17వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అక్కడికక్కడే మరణించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు జరుపుతున్నారు. వీరి మృతికి వైవాహిక కలహాలతోపాటు భాను చందర్ రెడ్డి అనారోగ్యం కూడా ఒక కారణం అయ్యుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి విచారణ అనంతరం అసలు విషయాలు తెలిసే అవకాశం ఉంది.