హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం వాయిదాల పద్ధతిని ఎంచుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. రిటైర్డ్ ఉద్యోగులకు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పెన్షన్, జీపీఎఫ్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవు, సరెండర్ లీవ్, గ్రూపు ఇన్సూరెన్స్ తదితర ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించాల్సిందేనని కీలక ఉత్తర్వులు జారీచేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు దక్కాల్సిన బెనిఫిట్స్ను ఈ నెల 9వ తేదీలోగా చెల్లించాలన్న గత ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై ధర్మాసనం మండిపడింది. కోర్టు ఆదేశాలను ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించింది. రిటైర్డు ఉద్యోగులకు చట్ట ప్రకారం అన్ని బెనిఫిట్స్ చెల్లించాల్సిందేనని, ఈ విషయంలో పాక్షిక చెల్లింపులు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఒక రిటైర్డు ఉద్యోగికి బకాయిలు చెల్లించని పరిస్థితులు ఉన్నా.. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి స్వ యంగా హైకోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.
ఇప్పటివరకు 737 మంది రిటైర్డు ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలు కల్పించామని ప్రభుత్వం చెప్తున్న లెకలకు, కోర్టులో దాఖలైన పిటిషన్లకు పొంతన కుదరడం లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెబుతుంటే.. పరిషారమైన పిటిషన్లు 221 మాత్రమే ఉన్నాయని చెప్పింది. అధికారులు టోకెన్లు జారీ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరుగలేదని మండిపడింది. మరోసారి చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది. తదుపరి విచారణలోగా పూర్తిస్థాయిలో చెల్లించాల్సిందేనని నొకి చెప్పింది. గడువు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం అలుసుగా తీసుకోరాదని హెచ్చరించింది. కోర్టులతో ఆటలాడవద్దని కూడా స్పష్టంచేసింది. రెగ్యులర్ ఉద్యోగులకు ఒక నెల జీతం ఆగినా పట్టించుకోబోమని, కానీ పదవీ విరమణ చేసిన వారికి వాళ్ల కష్టార్జితం చెల్లించకపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చింది. ఇచ్చే సొమ్ము ప్రభుత్వానిదేమీ కాదనే విషయాన్ని పాలకులు, అధికారులు గుర్తించాలని పేర్కొంది. ఉద్యోగాలు చేసినంతకాలం కూడబెట్టిన సొంత సొమ్మునే ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వం వారికి చెల్లిస్తున్నదన్న కీలక విషయాన్ని విస్మరించొద్దని చెప్పింది.
ఉద్యోగ విరమణ చేశాక పిల్లల చదువులు, పెండ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం వంటి ముఖ్యమైన జీవిత ప్రణాళికలను అమలు చేసుకునేందుకు అది ఉద్యోగులు దాచుకున్న సొమ్మని వివరించింది. తదుపరి విచారణ జరిగే నాటికి ఒక రిటైర్డు ఉద్యోగికి కూడా ప్రభుత్వం నుంచి బకాయిలు పెండింగ్లో ఉండటానికి వీల్లేదని తేల్చిచెప్పింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం లేదంటూ దాఖలైన పిటిషన్ల వారీగా ప్రభుత్వం చెల్లింపుల నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించాలని గత ఏడాది జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ దాఖలైన సుమారు 572కు పైగా కోర్టు ధికరణ పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషన్ల వారీగా లోతుగా పరిశీలన చేస్తూ సమగ్రంగా విచారణ జరిపారు. మొత్తం 221 పిటిషన్లలో ఉత్తర్వులు అమలైనట్టు తేల్చారు. మరో 3,656 మంది పిటిషనర్లకు టోకెన్లు జారీచేసి వాటిలో 1,056 మందికి చెల్లింపులు చేశారని తెలియజేసింది. ఇంకా 2,600 టోకెన్లు చెల్లించాల్సి ఉన్నదని గుర్తించింది. వీరందరికీ ఈనెల 3లోగా చెల్లిస్తామని గత విచారణలో ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని తప్పుపట్టింది. పూర్తిస్థాయిలో ఎందుకు చెల్లించలేదని నిలదీసింది. తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.