రాజన్న సిరిసిల్ల, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలన్నది తమ సర్కారు ఉద్దేశమని, సాగుచేస్తున్న లబ్ధిదారులైన పేదలకు న్యాయంచేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని అటవీ భూములను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని గుర్తుచేశారు. పోడు భూముల పేరిట ఎవరైనా డబ్బు వసూలుచేసినా, హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడినా జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. పోడు భూముల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేస్తామని చెప్పారు. అక్రమాలపై ఫిర్యాదుచేయడానికి ఒక ఫిర్యాదుల బాక్స్ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. 2005-06 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని తీసుకొచ్చిందని, వాటి పరిధిలో ఉన్న భూముల పరిష్కారానికి సీఎం కేసీఆర్ అఖిలపక్షంతో కలిసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలోని కేడీసీసీ బ్యాంకు నూతన భవన సముదాయాన్ని, బైపాస్ రోడ్డులోని రెడ్డి సంక్షేమ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘పోడు భూముల సమస్యల పరిష్కారం, అడవుల సంరక్షణ’ అంశాలపై అఖిలపక్ష నేతలతో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
చట్టానికి లోబడి చర్యలు
పోడు భూముల విషయంలో ప్రభుత్వం చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జిల్లాలో ఈ నెల 8 నుంచి 67 గ్రామాల్లో నిర్వహించనున్న సదస్సుల్లో అన్ని పక్షాల నేతలు పాల్గొని సమస్యలకు పారదర్శకంగా పరిష్కారం చూపాలని కోరారు. అటవీ భూములను ఎవరు ఆక్రమించినా అధికారులకు సమాచారమివ్వాలని చెప్పారు. అందుకోసం కలెక్టరేట్లో ప్రత్యేక ఫిర్యాదుల బాక్సు ఏర్పాటుచేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతికి సూచించా రు. ముస్తాబాద్ మండలం చీకోడులో ఆక్రమణకు గురైన భూములపై విచారణ జరిపించాలని ప్రజాప్రతినిధులు కోరగా, స్పందించిన మంత్రి వెంటనే విచారణకు ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకా రం 96,394 ఎకరాల (20%) అటవీ ప్రాంతం ఉన్నట్లు చెప్పారు. అందులో 8 వేల ఎకరాల్లో గిరిజనులు, ఇతరులు పోడు వ్యవసాయం చేసుకొంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించనున్న సదస్సుల్లో అర్జీలు స్వీకరించి, అర్హత గల లబ్ధిదారుల ఎంపికలో వాస్తవిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందని చెప్పా రు. పోడు సమస్య పరిష్కారం తర్వాత భవిష్యత్తులో తిరిగి అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలు, జిల్లా స్థాయిలో అటవీ సంరక్షణ కమిటీలు ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. అడవిలో ఎటువంటి ఆక్రమణలు జరుగకుండా చూస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు.
ధరణితో చిన్న, సన్నకారు రైతులకు మేలు
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. కొన్ని సమస్యలున్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్న దిశగా ముందుకు పోతున్నామని చెప్పారు. త్వరలో డిజిటల్ సర్వే చేపడుతామని, అక్షాంశాలు, రేఖాంశాలతో భూముల విషయంలో కచ్చితమైన సమాచారం ఉంటుందని చెప్పారు. హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. దేశంలోని 24 రాష్ర్టాల్లోకెల్లా అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. హరితహారం నిర్వహించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 4.5% అడవి పెరిగిందని, భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని చెప్పారు. వాతావారణ సమతుల్యత దెబ్బతింటే అతివృష్టి, అనావృష్టి, వంటి అనేక సమస్యలు వస్తాయని అన్నారు. భూ సమస్యలున్న చోట అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, బీఎస్పీ, సీఐటీయు, ఆర్పీఐ తదితర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పాల్గొన్నారు.
పోడు భూముల పేరిట ఎవరైనా డబ్బు వసూలుచేసినా, హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడినా జైలుకు వెళ్లక తప్పదు. భవిష్యత్తులో అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలు, జిల్లా స్థాయిలో అటవీ సంరక్షణ కమిటీలు ఏర్పాటుచేయాలి.
–మంత్రి కేటీఆర్