నిజాంసాగర్, ఫిబ్రవరి 6: ప్రొసీడింగ్ కాపీల కోసం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయం చుట్టు చక్కర్లు కొడుతున్నారు. ప్రొసీడింగ్ ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగిలో 13 మందికి 20 రోజుల క్రితం ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. వారికి ప్రొసీడింగ్ కాపీలు వెలువడినా అధికారులు అందజేయలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి తమకు ప్రొసీడింగ్ కాపీలు ఇస్తే ఇండ్లు నిర్మించుకుంటామని, లేదంటే చావే శరణ్యమంటూ బైఠాయించారు.
పోలీసులు వారిని సముదాయించగా, 6న ప్రొసీడింగ్ కాపీలు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉద యం గ్రామానికి చెందిన వడ్ల అమృత భర్తతో కలిసి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లింది. ప్రొసీడింగ్ కాపీ ఇవ్వాలని ఎంపీడీవోను వేడుకున్నా స్పందన కరువైంది. దీంతో ఆమె పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకుంటానని రోదించసాగింది.
ఇంటిని నిర్మించుకుందామంటే అధికారులు ఈ విధంగా చేయడం తగద,ని ప్రొసీడింగ్ కాపీ ఇవ్వకపోతే చావే శరణ్యమని, కలెక్టర్ చొరవ తీసుకోవాలని వేడుకున్నది. ఈ విషయమై ఎంపీడీవో శివకృష్ణను వివరణ కోరగా, అనివార్య కారణాలతో ప్రొసీడింగ్ కాపీలను ఇవ్వలేకపోయామని, త్వరలో అందజేస్తామని తెలిపారు.