రాంనగర్ (కరీంనగర్), ఫిబ్రవరి 16: దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం స్ఫూర్తికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. లబ్ధిదారులు కొనుగోలు చేసిన వాహనాలను అడ్డదారుల్లో హస్తగతం చేసుకొంటున్నారు. ఇందుకు రవాణాశాఖలోని అధికారులు సహకరిస్తున్న తీరు అవినీతికి పరాకాష్టగా నిలుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లంఘించి మరీ వాటిని ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్న బాగోతం హుజూరాబాద్ నియోజకవర్గంలో వెలుగుచూసింది. దళితబంధు పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా దాదాపు ఎనిమిది వేల మంది లబ్ధిదారులు వాహనాలను కొనుగోలు చేశారు. వీరిలో కొందరు ఆయా వాహనాలను నిత్యం నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
మరికొందరు అప్పుడప్పుడూ వాటిని వినియోగిస్తున్నారు. ఇలాంటి వాహనాల మీద దళారుల కన్నేశారు. లబ్ధిదారులకు ఎర వేసి, ఆయా వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. నిజానికి దళితబంధు వాహనాల రిజిస్ట్రేషన్లను ఐదేండ్లపాటు ఇతరుల పేరిట మార్చడానికి వీలులేకుండా కేసీఆర్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. ఆయా వాహనాలకు ప్రత్యేక కోడ్తో నంబర్లు కేటాయించింది. ఆయా కోడ్ ఉన్న వాహనాలను ఐదేండ్లపాటు ఇతరుల పేరు మీదకు మార్చడానికి వీలులేదు. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత రవాణాశాఖలోని అక్రమార్కులు ఈ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు.
దళితబంధు వాహనాలను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక కోడ్కు బదులుగా సాధారణ నంబర్లు ఇస్తున్నారు. హుజూరాబాద్కు చెందిన ఒక ఆర్టీఏ ఏజెంట్ ఈ విషయంలో యాక్టివ్గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. కరీంనగర్ ఆర్టీఏ కార్యాలయంలోని ఒక ఉన్నతాధికారి సహాయంతో ఈ అక్రమానికి తెరలేపినట్టు సమాచారం. అందుకు ఆర్టీఏ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఇతను గతంలో ఖమ్మం జిల్లాలో పనిచేసినప్పుడు ఏసీబీ కేసులో చిక్కి కొంతకాలం విధులకు దూరంగా ఉండటం గమనార్హం. కోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఉద్యోగంలో చేరిన ఈ అధికారి చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీఏ ఏజెంట్కు పూర్తిస్థాయిలో సహకరిస్తూ పెద్ద మొత్తంలో దండుకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి.
రవాణా శాఖ కార్యాలయంలో సెక్షన్ సిబ్బంది ఎలాంటి లావాదేవీలు జరిపినా వాటిని పర్యవేక్షణ అధికారి పర్యవేక్షించి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అయితే, దళితబంధు వాహనాల విషయంలో మాత్రం పర్యవేక్షణ అధికారి సిబ్బంది ప్రమేయం లేకుండా ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించుకొని హుజూరాబాద్కు చెందిన ఏజెంట్ ద్వారా ఈ తతంగం నడిపించినట్టు తెలుస్తున్నది. హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక ఏజెంట్ దళితబంధు వాహనాలను అమ్మేలా చేయడంతోపాటు వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మార్పిడి చేయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీనికి రవాణా శాఖ పర్యవేక్షణ అధికారి కూడా తోడవడంతో భారీగా ముడుపులు ముట్టజెప్పి, వాహనాలకు ఫైనాన్స్ క్లియరెన్స్ లేకున్నా ఇతరుల పేరు మీదికి మార్పిస్తున్నారు. అందుకు సహకరిస్తున్న ఆర్టీఏ అధికారికి ఒక్కో వాహనానికి రూ.లక్ష చొప్పున ముట్టజెప్పినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది.
ఈ ముడుపులన్నీ పర్యవేక్షణ అధికారి కనుసన్నల్లో మెలిగే ప్రైవేట్ వ్యక్తికి అందుతున్నట్టు సమాచారం. రవాణా శాఖ సిబ్బంది లావాదేవీలు, ఏజెంట్లకు సంబంధించిన లావాదేవీల్లో కూడా ఆ ప్రైవేటు వ్యక్తి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దళిత బంధు పథకం కింద లబ్ధిదారులు పొందిన వాహనాలను ఎస్సీ వెల్ఫేర్ శాఖకు సమాచారం ఇవ్వకుండా, లబ్ధిదారుడిని కనీసం ప్రశ్నించకుండా ముడుపులు పుచ్చుకొని రిజిస్ట్రేషన్ మార్పిడి చేయడం రవాణా శాఖ అవినీతికి అద్దం పడుతున్నది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిస్తున్నది.