Sheep Distribution | నల్లగొండ, జనవరి 8: రెండో విడత గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సబ్సిడీ గొర్రెల యూనిట్ల కోసం డీడీలు చెల్లించిన వారందరికీ గొర్రెల యూనిట్లు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా 82 వేల మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించడంతో ఆ డబ్బులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో లబ్ధిదారుడు సబ్సిడీ కింద రూ.43,750 డీడీ రూపంలో చెల్లించగా అవి రూ.34.34 కోట్లు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. వారికి యూనిట్లు ఇచ్చే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ ఆగిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గొర్రెల యూనిట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు.