ములుగురూరల్, జనవరి 25: రెండో విడత దళితబంధు నిధులు విడుదల చేయాలని ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద లబ్ధిదారులు, దళితులు గురువారం ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు కోగిల మహేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేయగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. దళితులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ దీక్షకు భూపాలపల్లి, పినపాక, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన దళితబంధు సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.