హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): బేగంపేట విమానాశ్రయంలో ఈ నెల 18 నుంచి 21 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘వింగ్స్ ఇండియా-2024’ ప్రదర్శనను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఆమె ఈ కార్యక్రమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఫిక్కీ ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. రెండేండ్లకోసారి నిర్వహించే వింగ్స్ ఇండియా ప్రదర్శనలో ఈ ఏడాది కొత్త తరం ఏయిర్క్రాఫ్ట్లతోపాటు పలు విమాన తయారీ సంస్థలు, విమానయాన సేవల సంస్థలు, ఆగ్జిలరీ యూనిట్లు, పర్యాటక విభాగాలు పాల్గొనున్నాయని తెలిపారు.
దేశ, విదేశాల నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరయ్యే ఈ ఈవెంట్కు విస్తృత ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. చివరి రెండు రోజుల్లో లక్ష మందికిపైగా సందర్శకులు ఈ ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలను గుర్తించాలని పోలీస్ శాఖకు స్పష్టం చేశారు.
పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు. ఈనెల 16 నుంచి ప్రదర్శన ముగిసే వరకూ బేగంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఎవరూ పతంగులు ఎగరేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పౌర విమానయాన శాఖ జాయింట్ సెక్రటరీ అసంగ్బా చుబా ఆవో, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఫిక్కీ డైరెక్టర్ మనోజ్, విమానయాన విభాగం డైరెక్టర్ భరత్రెడ్డి, బేగంపేట ఏయిర్పోర్ట్ డైరెక్టర్ పీకే హజారీ తదితరులు పాల్గొన్నారు.