బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టేకేదారులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి, టేకేదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పింఛన్లు అమలు చేసి ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. 6 లక్షల మంది బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు యావత్ బీడీ కార్మికులు రుణపడి ఉంటారని తెలిపారు.
దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ పరిశ్రమలు ఉండగా.. తెలంగాణ మినహా ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వడం లేదని రూప్ సింగ్ తెలిపారు. రకరకాల పేర్లతో బీడీ పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.