హైదరాబాద్: రాష్ట్రంలో బడి గంట మోగింది. కరోనా నేపథ్యంలో 18 నెలల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని రాజ్భవన్ స్కూల్ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పాఠశాలను అధికారులు చాలాబాగా శుభ్రం చేయించారన్నారు. విద్యార్థులు సంతోషంగా, నిర్భయంగా స్కూలుకు వచ్చారని వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. మాస్కు ధరించడంపై విద్యార్థులకు అవగాహన ఉందని చెప్పారు. పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించి విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. భౌతిక తరగతులకు ముందే సిబ్బందని స్కూళ్లను శుభ్రం చేయించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించిన తర్వాతే తరగతులకు అనుమతించారు.