హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థలతో వేధించడం తప్ప బీజేపీ చేసింది ఏమైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ ఏమి ఒరగబెట్టిందని ఓట్లు అడుగుతుందని నిలదీశారు.
గాంధీభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా అవమానించారని, అలాంటి పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే నైతికహక్కు లేదని చెప్పారు. విభజన చట్టంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్రెడ్డి సికింద్రాబాద్కు ఏమి చేశారని ప్రశ్నించారు.
పదేండ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలపై ఈ నెల 14న కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో దీక్ష చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీజేపీ హయాంలో తెలంగాణకు చేసిందేమిటో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.