హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ): పీసీసీ పీఠంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. బీసీలకు పదవులు దక్కనివ్వరా? అంటూ వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా రు. మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మా ట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. జగ్గారెడ్డిని పీసీసీ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తుందని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకే చెందిన బీసీ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం పెద్దలు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలా ఇంటాబయట తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి కోమటిరెడ్డి యూటర్న్ తీసుకొన్నారు. తాను పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ను తొలగించాలని అనలేదని, ఆయన సారథ్యంలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటూ చెప్పుకొచ్చారు. సంగారెడ్డి జిల్లాలో రంజాన్ వేడుకల్లో జగ్గారెడ్డి నిర్వహణ బాగుందని అనిపించిందని, భవిష్యత్తులో ఆయన పీసీసీ అధ్యక్షుడు అయితే బాగుంటుందని మాత్రమే చెప్పానని తెలిపారు. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడిని తొలగించాలనేది తన ఉద్దేశం కాదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వివరణ ఇచ్చారు.